బీజేపీ నాయకులు సిల్లీ ఫెలోస్.. వారికి ఉప్పు తిన్న విశ్వాసం తెలియదు : శివాజీ

శుక్రవారం, 22 మే 2015 (06:45 IST)
రాష్ట్రంలోని బీజేపీ నాయకులను తాను సిల్లీ ఫెలోస్ అని పిలుస్తానని సినీ నటుడు శివాజీ అన్నారు. ఎన్నికలకు ముందు వారు చెప్పిన మాటలేంటి? పోలవరం మన జీవనాధారం అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రారంభమైన ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదని మొసలి కన్నీరు కార్చారని మండిపడ్డాడు. ఎస్వీరంగారావును తలపించేలా డైలాగులు చెప్పారని విమర్శించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వారు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
 
ఏపీలో కలవాల్సిన కొన్ని మండలాలను తెలంగాణాలో కలిపేశారని ఆరోపించారు. అసలు వీరు మనుషులేనా..? వీరికి సంస్కారం ఉందా.? అని మండిపడ్డారు. ఏపి నేతలకు ఈ ప్రాంత ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదన్నారు. పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా పక్కన పెట్టి ప్రత్యేక హోదాపై అన్ని పార్టీల నాయకులు కలసి రావాలని పిలుపునిచ్చారు. 
 
ప్రత్యేక హోదాను సింపుల్ గా తీసుకునే నాయకులను తాను సిల్లీ ఫెలోస్ గా చూస్తానని అన్నారు. వాళ్ళ ఇళ్ళలో ఉండే ఒకరిద్దరు పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలి చేయవద్దని హితవు పలికారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓపిక ఉన్నంత కాలం పోరాడుతానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి