జగన్ లాంటి సీఎంను చూసి వుండరు: బిజెపిపై రోజా ఫైర్

బుధవారం, 29 డిశెంబరు 2021 (20:10 IST)
వైసీపి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర ఏళ్లలో 99 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదని నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా అన్నారు. తిరుమల స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపలకు‌ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.

 
వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసారని, తమ ఉనికి కాపాడుకునేందుకే టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె‌ విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి తీరు హస్యాస్పదంగా ఉందని, బిజెపి, టీడీపీలపై ప్రజలు ఆగ్రహంతో ఉంటె బిజెపి జనాగ్రహ సమావేశాలు నిర్వహించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు.

 
విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం, పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయించడంలో బిజెపి వైఫల్యం చెందిందన్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా కుంటిసాకులు చెప్పకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ప్రజలకు అండగా ఉన్న ఏకైన సీఎం జగనే అని, కేవలం జగన్ పైన బురద జల్లేందుకే రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రతిపక్షాల వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

 
టీడీపీ నుంచి బిజెపిలో చేరిన నాయకుల స్క్రిప్టును బిజెపి నాయకులూ చదువుతున్నారని, టీడీపీ, బిజెపి తీరు చూస్తుంటే, వారు అధికారంలో ఉంటే చేయరు, వేరే వారు చేస్తే సహించరని ఆరోపించారు. చిన్న సినిమాలకు సినిమా హాల్ కావాలన్నా, పేదలకు టిక్కెట్లు ఫిక్స్డ్ రేట్ ఉంటేనే సినిమా చూడగలరని, పెద్ద సినిమా వాళ్ళు బడ్జెట్ ఎక్కువగా ఉంటుందన్నారు.

 
కాబట్టి మాకు ఇబ్బంది అని చెప్తున్నారని, అయితే ప్రభుత్వంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. పెద్ద సినిమా, చిన్న సినిమాలకు ఉపయోగ పడేలా నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫ్రెండ్లీ నేచర్ కలిగిన జగన్ లాంటి సీఎంలను బీజెపి నాయకులు చూసి ఉండరన్నారు.

 
ప్రొడ్యూసర్స్, చిరంజీవి, నాగార్జున, మరికొందరు సినీ తారలు కలసి ఆన్‌లైన్ చేయాలని కోరితేనే సీఎం ఆన్లైన్ చేసారని, పొలిటికల్ గేమ్ కోసం దీనిని కొందరు నాయకులు పావుగా వాడుకుంటున్నట్లు ఆరోపించారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం మనస్సుకు సంతృప్తిని ఇచ్చే విషయమని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని రోజా హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు