ముఖ్యమంత్రివి శ్రీరంగ నీతులు.. నీతిమాలిన పనులు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (18:21 IST)
ఆంధ్రప్రదేశ్ ఆర్థికఉగ్రవాది చేతచిక్కి, దివాళాతీసే దిశగా సాగుతోందని, ఇప్పటికే లక్షా27వేలకోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం, అభివృద్ధిని శూన్యం చేసిందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్లే గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

మంగళవారం ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విలేకరులకు పంపించారు. ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ పేలపిండిలా గాలికిపోయాయని, రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయని, ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాలు విచ్చలవిడి అవినీతితో పేట్రేగిపోతున్నాయని గోరంట్ల స్పష్టంచేశారు.

ముఖ్యమంత్రేమో  నీతివాక్యాలు చెబుతూ, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నా డన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుకకుంభకోణంలో అడ్డగోలుగా  అవినీతి చేస్తున్నా ఆయన ప్రశ్నించడంలేదన్నారు.  ఇళ్లస్థలాల పేరుతో రూ.4వేలకోట్లు కాజేసినా, దానిపై సీబీఐ విచారణ జరిపించాలంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

మైనింగ్ శాఖను నిర్వహిస్తున్న మంత్రే, ఏడీబీ నిధులను కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మీడియాలో రావడంతో టెండర్లను రద్దుచేయడం జరిగిందని బుచ్చయ్యచౌదరి తెలిపారు. మద్యం రేట్లు భారీగా పెంచినా, ఇతరరాష్ర్టాల నుంచి వస్తున్న మద్యం, నాటుసారాను వైసీపీ ప్రభుత్వం అరికట్టలేకపోయిందన్నారు.

ఇసుకకొరతతో, కోవిడ్ కారణంగా ఉపాధికోల్పోయిన భవననిర్మాణ రంగ కార్మికులకు చెల్లించాల్సిన రూ.1200కోట్లను కూడా ప్రభుత్వమే కాజేసిందన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు అందే సంక్షేమ పథకాలు, నిధులనుకూడా నిలిపివేశారన్నారు. సంక్షేమ రంగంకోసం కూడాప్రభుత్వం అప్పులుచేసే దుర్గతికి చేరిందన్నారు. 

హిందూ దేవాలయాలపై భారీ ఎత్తున దాడిచేస్తున్నారని, దేవాలయాల ఆస్తులను కొల్లగొడుతున్నారన్నారు. ఆలయభూములను ఇళ్లస్థలాల పేరుతో దొడ్డిదారిన లాక్కుంటున్నారని, అదేమని ప్రశ్నించినవారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. ఒక చర్చిపై రాళ్లు వేశారంటూ, 40మందిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 

ప్రభుత్వవైఖరి హిందూమత ధర్మాలకు ఏవిధంగా నష్టంచేస్తుందో ప్రజలంతా ఆలోచించాలన్నారు. గోదావరి ఆనకట్ట ముందు డ్రెడ్జింగ్ చేస్తూ, దోపిడీ చేస్తున్నారని, భవిష్యత్ లో ఆనకట్టకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులవుతారని గోరంట్ల ప్రశ్నించారు.

అనధికార ముఖ్యమంత్రిగా చలామణీ అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ సాగుతున్నాయన్నారు. ఆయన పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టుపట్టించాడన్నారు. విగ్రహాలను ధ్వంసంచేసినవారిపై, రథాలు తగలబెట్టిన వారిపై ఇంతవరకూ చర్యలులేవన్నారు.

ప్రభుత్వ తప్పుడు విధానాలను న్యాయస్థానులు ఖండిస్తుంటే, ముఖ్యమంత్రి సూచనలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యాయవ్యవస్థను తూలనాడుతున్నారని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విగ్రహలు విరిగిపోతే ఏమైందంటూ, వితండవాదం చేస్తున్న పనికిమాలిన, మతిమాలిన బూతులమంత్రిపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అటువంటి వారు మంత్రులుగా ఉండటం ప్రజల దౌర్భాగ్యమన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకొని కోట్లకు పడగలెత్తుతున్నారన్నారు. ఆసరా,చేయూత పేరుతో గుంపులు గుంపులుగా జనాన్ని పోగుచేస్తున్నారని, ప్రభుత్వ తీరుని నిరసిస్తూ, ఎక్కడైనా పదిమంది చేరితేమాత్రం కోవిడ్ పేరుతో కేసులు పెడుతున్నారన్నారు.

కోవిడ్ నిబంధనలపేరుతో చర్యలు తీసుకోవాలంటే, ముందు అధికారపార్టీ ఎమ్మెల్యేలపైనే కేసులు పెట్టాలన్నారు. సాక్షిపేపర్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారం రాతలురాయిస్తూ, సోషల్ మీడియాలో కూడా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నిజంగా ప్రభుత్వానికి, పాలకుడికి దమ్ము, ధైర్యముంటే, ముందు తనపార్టీ వారిపైనే చర్యలు తీసుకోవాలని బుచ్చయ్య డిమాండ్ చేశారు.

మాటతప్పను, మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తే, నేడు ప్రతిపక్ష పార్టీవారిని బెదిరించి, తనపార్టీలోకి చేర్చుకుంటున్నాడన్నారు. వాసుపల్లి గణేశ్ కుమార్ కళాశాలపై దాడిచేసి, అధికఫీజులు వసూలుచేస్తున్నారని ఆయన్ని ప్రభుత్వం లొంగదీసుకుందన్నారు.

మద్దాలిగిరికి చెందిన కంపెనీపై దాడిచేశారని, మిగతా స్పిన్నింగ్ మిల్లులకు రాయితీలు చెల్లించకుండా, ఆయన మిల్లుకే ఎందుకు చెల్లించారో చెప్పాలన్నారు. వల్లభనేని వంశీమోహన్ పై ఫోర్జరీ కేసు పెట్టి లొంగదీసుకున్నారన్నారు.

ఈ విధంగా ముఖ్యమంత్రి పైకి శ్రీరంగ నీతులు చెబుతూ, నీతిమాలిన పనులతో దొమ్మరి గుడిసెల్లో దూరుతున్నాడని టీడీపీఎమ్మెల్యే మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్లుగా టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తనపార్టీ తరుపున జగన్ గెలిపించుకోవాలన్నారు.

రాజధానిలో జరిగేది రైతుల ఉద్యమం కాదంటున్న ప్రభుత్వం, మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ప్రజల్లోకి వెళ్లి తిరిగి గెలిపించుకొని చూపాలన్నారు.

వారితో పాటు తాను కూడా రాజీనామా చేస్తానని బుచ్చయ్య స్పష్టంచేశారు. గూండారాజ్యం ఎన్నో రోజులు సాగదన్న ఆయన ప్రభుత్వపెద్దలు, ముఖ్యమంత్రికి జైలువాసం గడిపే సమయం దగ్గరపడిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు