పోలీసులు లేని స‌మాజం ఊహించుకోలేం.. డీజీపీ

శనివారం, 12 అక్టోబరు 2019 (08:07 IST)
పోలీసులు లేని సమాజం ఊహించుకోలేం అని రాష్ట్ర డీజీపీ డి.గౌత‌మ్‌స‌వాంగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ద్రోణ కన్సల్టెన్సీ అధినేత సురేష్ బేత రూపకల్పన చేసిన "శౌర్యం" మరియు "స్మతి" కరపత్రాలను డీజీపీ గౌతమ్‌సవాంగ్ శుక్ర‌వారం త‌న కార్యాల‌యంలో విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా డీజీపీ గౌత‌మ్‌స‌వాంగ్ మాట్లాడుతూ.. "పోలీసుల విధి నిర్వ‌హ‌ణ చాలా శ్రమతో కూడుకున్నది. 24 గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే అన్నారు. పోలీసులు లేని సమాజం ఊహించుకోలేం అని తెలిపారు. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. అన్ని పరిస్థితులలో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు.

పోలీసులు చేసే గొప్ప త్యాగాలు చాలావ‌ర‌కు ఎవరి దృష్టికీ రాకుండా పోతుంటాయి. కాని వారు మాత్రం అందరి అంచనాలకు మించి నిరంతరం నిస్వార్థ సేవ చేస్తుంటారు. నేడు మన సమాజం సురక్షితంగా ఉంది అంటే అది కేవలం పోలీసుల‌ యొక్క సేవాతత్పరత వల్లే.

మత విద్వేషాలు, అంతర్గత కలహాలు, తీవ్రవాదుల నుండి ముప్పు, వివిధ రకాల నేరాలు, శాంతిభద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల్లో విధి నిర్వహణ , ట్రాఫిక్ నియంత్రణ, వి.ఐ.పి. భద్రత లాంటి మరెన్నో సంక్లిష్టమైనవి పోలీసుల విధులు" అని డీజీపీ పేర్కొన్నారు.

కార్యక్రమంలో లా అండ్ ఆర్డ‌ర్ డీజీ రవిశంకర్ లయ్యనార్, ఏఐజి భాస్కర్ భూషణ్, డీఎస్పీ అనిల్‌కుమార్, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు