కులాల కుంపటి వద్దు... హిట్లర్ కన్నా గొప్పవాళ్లు లేరు : నాగబాబు

శుక్రవారం, 10 జనవరి 2020 (12:47 IST)
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ గత 24 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు అండగా నిలబడ్డారు. వారికి స్వాంతన చేకూర్చే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని మరో హిట్లర్‌తో పోల్చారు. హిట్లర్ కంటే గొప్పవారు లేరనీ, అలాంటి హిట్లరే నాశనమైపోయాడని గుర్తు చేశాడు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తుళ్లూరులో అమ్మవారి గుడికి వెళుతున్న మహిళలపై పోలీసులు లాఠీ ఝుళిపించడం చాలా దారుణమన్నారు. యాదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన అడాల్ఫ్ హిట్లర్ కంటే గొప్పవాళ్లు ఎవరూ లేరనీ, అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయారని అన్నారు. 
 
ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేస్తున్నా.. జగన్ రెడ్డిగారు.. మీరు ఆ తరహా తప్పు చేయవద్దంటూ హితవు పలికారు. పైగా, రాజధానిని తరలించాలంటూ తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకునే సమయం మీకు ఉందన్నారు.
 
కులం అనేది ఎప్పుడూ చెడ్డది కాదని... మనుషుల్లోనే మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారని... కులాల మీద పగబట్టి, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదన్నారు. ఇదేసమయంలో అమరావతి ప్రాంతానికి చెందిన నెత్తురోడుతున్న ఓ మహిళ ఫొటోను షేర్ చేశారు. 
 
కాగా, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత 24 రోజులుగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనలపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. అయితే, వైకాపా ప్రజాప్రతినిధులు మాత్రం రాజధాని రైతుల ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తున్నారు. 
 
వీటిపై నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. కామెంట్ చేసే ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి మాట్లాడితే, అప్పుడు అక్కడి ప్రజలు చేసే సన్మానాన్ని తాను చూడాలని అనుకుంటున్నానని అన్నారు. "రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీ రూమ్స్‌లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే, వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది" అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు