మహిళలను ట్రాప్ చేయడంలో గుంటూరు జిల్లా పోలీసులే టాప్

మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (20:00 IST)
మహిళలను ట్రాప్ చేసి, తమ వలలో వేసుకుని వారితో రాసలీలలు సాగించడంలో గుంటూరు జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలతో పోల్చితే ఈ తరహా సంఘటనలు ఒక్క గుంటూరు జిల్లాలోనే అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా వరుస సంఘటనలతో పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా, బాధిత మహిళలు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నారు. 
 
తాజాగా గుంటూరు జిల్లాలో మోడల్ పోలీస్ స్టేషన్‌గా మార్చిన నగరపాలెం పోలీసు స్టేషన్‌లో వెంకట రెడ్డి సీఐగా విధులునిర్వహిస్తున్నారు. అక్కడకు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళను ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు ఆమెను అన్ని రకాలుగా వాడుకుని చివరికి వదిలేశాడు.
 
సీఐ చేతిలో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ... జిల్లా అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గుంటూరు రేంజి ఐజీ ఆదేశాల మేరకు ఈ అంశంపై ఎస్పీ విచారణ చేపట్టగా, అందులో సీఐ నిజస్వరూపం బహిర్గతమైంది. దీంతో వెంకటరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లాలో కొంతకాలం నుంచి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
గతంలో జిల్లాలోని అరండల్‌పేట ఎస్ఐ బాలకృష్ణ వ్యవహారం కూడా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఎస్ఐ బాలకృష్ణతో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. 
 
అలాగే, మరో ఎస్ఐ కూరపాటి నాగేంద్ర కూడా తనను లైంగికంగా వేధించారని ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయమైన ఎస్ఐ లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా బాధితురాలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇంకా విచారణ జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు