జగన్... నా నాలుగో పెళ్ళాం నువ్వేనా.. అయితే రా!! : సెటైర్లు పేల్చిన పవన్ కళ్యాణ్

వరుణ్

బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (22:09 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వంగ్యాస్త్రాలు సంధించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన పార్టీ జెండా బహిరంగ సభలో జగన్‌పై పవన్ విరుచుకుపడ్డారు. జగన్ దృష్టిలో పవన్ అంటే మూడు పెళ్ళిళ్లు, రెండు విడాకులు అని చెప్పుకొచ్చారు. తాను కూడా అతనిలా మాట్లాడగలనని చెప్పారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌ సొసైటీలో జగన్ ఎలాంటి పనులు చేశారో తన వద్ద టన్నుల కొద్దీ సమాచారం ఉందన్నారు. జగన్‌కు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు. అతడి దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్లాం ఎవరో తెలీదు. మరి అది జగనేమో నాకు తెలియదు. నాకు ఇదే విసుగొస్తుంది. లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వేనా జగన్.. అయితే రా జగన్ రా అంటూ సెటైర్లు వేశారు. 
 
వైఎస్ భారతీ మేడం గారూ.. మీకు చెబుతున్నాను.. మేం ఎపుడైనా సరే మిమ్మల్ని మేడం భారతి గారూ అని గౌరవంగా మాట్లాడుతాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా గానీ, చంద్రబాబు సతీమణి గురించి నీచంగా మాట్లాడినాకానీ, నా భార్యను అన్నాకానీ మేం మిమ్మల్ని ఏమీ అనలేదు. పెళ్లాలు.. పెళ్లాలు అంటాడు.. ఆ మాట మేం మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతీగారూ... ఒక్కసారి ఆలోచించండి. నేనేమీ ఇంగ్లీషు మీడియాలో చదువుకున్న వాడ్నికాదు. నాక్కూడా భాష వచ్చు. నేనూ మాట్లాడగను అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. 
 
సీట్ల పంపకంపై నాకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు... మీకేం తెలుసు ఈ జగన్ ఎలాంటివాడో! సొంత బాబాయ్‌ని చంపాడు... సొంత చెల్లెలిని గోడకేసి కొట్టాడు. నేను ఎవడితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చూడొద్దు. సొంతబాబాయ్‌ని చంపి గుండెపోటు అన్నా, వేల కోట్లు దోచినా, దళిత డ్రైవర్‌ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా ఎవరూ ప్రశ్నించరు. ఏ తప్పు చేయని నన్ను ప్రశ్నిస్తారేంటి? మీరు నన్ను ప్రశ్నించవద్దు. నా వ్యూహం నాకు ఉంది. నన్ను నమ్మి నా వెంట నిలబడండి.. మా జనసైనికుల్లాగా. వీర మహిళల్లాగా. అంతేకానీ, ఉచిత సలహాలు ఇచ్చే పని పెట్టుకోవద్దు అని తనదైనశైలిలో తనను విమర్శించే వారికి సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. 
 
రాష్ట్రంలో ఐదుగురు రెడ్ల కోసం ఐదురన్నర కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా ఈ ఐదుగురు రెడ్లు ప్రజలకు ఏం కావాలో నిర్ణయిస్తారు. ప్రజలకు ఏం కావాలో నిర్ణయించడానికి మీరెవరు? మాట్లాడితే నేను ఒక్కడినే అని జగన్ అంటున్నాడు. నువ్వు నిజంగా ఒక్కడివా? ఒక్కడివే ప్రజలను ఇబ్బంది పెడుతున్నావా? ఈయన యువ ముఖ్యమంత్రి అంట. యువతను బొంద పెట్టడానికి తప్ప ఈ యువ ముఖ్యమంత్రి ఎందుకూ పనికిరాలేదు అంటూ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు