రాబోయే 30 యేళ్లు వైకాపాదే అధికారం : సీఎం జగన్ జోస్యం

గురువారం, 27 అక్టోబరు 2022 (16:27 IST)
వచ్చే 30 యేళ్ల పాటు వైకాపాదే అధికారం అని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. పైగా, 175కు 175 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేయడం సాధ్యమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగింస్తూ, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అవినీతి రహితంగా పాలిస్తున్నందుకు ప్రజలు మరోమారు తమకే పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన సాగుతోందన్నారు. మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన కోరారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని, వారి ఆశీర్వాద బలంతో వచ్చే 30 యేళ్లు రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. 
 
ప్రభుత్వ పనితీరు ఇపుడు అంతటా మారిపోయిందన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌తో పల్లెల వాతావరణమే మారిపోయిందని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వివరించి వచ్చే ఎన్నికల్లో కూడా మనకే ఓటు వేయాలని ప్రతి ఒక్కరికీ చెప్పాలని, ఇందుకోసం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు