రూ.18 లక్షల విలువచేసే డ్రైఫ్రూట్స్ బొక్కేశారు...

మంగళవారం, 4 జూన్ 2019 (07:08 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ... ఇప్పటివరకు సచివాలయంలో అడుగుపెట్టలేదు. అయినప్పటికీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయా శాఖల ఉన్నతాధికారులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు హాజరువుతున్నారు. 
 
ఈ సమీక్షల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా విద్యాశాఖలో సమీక్ష చేస్తున్న సమయంలో ఏపీ ఉన్నత విద్యామండలిలో జరిగిన ఓ తంతు బయటపడింది. ఈ శాఖలో పనిచేస్తున్న.. కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లలో 18 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మాటలు విన్న జగన్ ఒకింత షాక్‌కు గురయ్యారు. 
 
ఇప్పటికే ఆర్థికశాఖలో జరిగిన అక్రమ కేటాయింపులపై ఓవైపు చర్చ జరుగుతుండగానే ఏపీ ఉన‌్నత విద్యామండలిలో జరిగిన ఈ పరిణామం తాజా ప్రభుత్వానికి విస్మయం కలిగించింది. అయితే ఈ మొత్తం అధికారిక కార్యక్రమాల సందర్భంగా వాడిన డ్రైఫ్రూట్స్‌కు ఖర్చు చేశారా? లేక సొంత అవసరాల కోసం వాడుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. 
 
రివ్యూల్లో గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించాలని సీఎం హోదాలో జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అక్రమాలు జరిగినట్టు తేలితే సీఎం చర్యలకు సిద్ధమయ్యే అవకాశాలు లేకపోలేదని సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు