ప్రసవించే తల్లులకు రూ.5 వేల నగదు : సీఎం జగన్ ఆదేశం

సోమవారం, 13 జూన్ 2022 (19:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రసవానికి రూ.5 వేలు చొప్పున నగదు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఆయన సోమవారం వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 
 
ఇందులోభాగంగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆస్పత్రుల్లో నాడు నేడు, కొత్త వైద్య కాలేజీ నిర్మాణం, కేన్సర్ కేర్ తదితర అంశాలపై సమీక్ష చేశారు. 
 
ఇందులో ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. ఏ తరహా ప్రసవం జరిగినా (సహజ మరణం లేదా సిజేరియన్) ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు నగదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం లేదా సిజేరియన్ ప్రసవం అయినా ఆరోగ్య ఆసరా వర్తింపజేయాలని స్పష్టం చేశారు. అదేసమయంలో సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని, ఈ దిశగా మహిళల్లో అవగాహన, చైతన్యం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. 
 
అదేవిధంగా ఆరోగ్య శ్రీ పథకం కింద మరిన్ని చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు 2446 రకాల చికిత్సలు అమల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆరోగ్య శ్రీ కార్యకలాపాల కోసం ఏడాదికి రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు