ఏపీలో 1,461 మందికి కరోనా పాజిటివ్‌.. సరికొత్త మార్గదర్శకాలు విడుదల

మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:38 IST)
ఏపీలో 1,461 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,564 కు చేరగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,85,182కు చేరింది. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ‍మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 2,113 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 19,52,736 మంది ఏపీలో డిశ్చార్జ్‌ కాగా ఏపీలో ప్రస్తుతం ఇంకా 18,882 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,53,11,733 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై వివాహాలు, ఇతర శుభకార్యాలతోపాటు మతపరమైన సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య 150కి మించరాదని ప్రభుత్వం పేర్కొంది. 
 
వేదికలు, ఇతర చోట్ల సీట్లు పక్కపక్కనే ఉంటే మధ్యలో ఒకదానిని విడిచిపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీట్లు కనుక ముందుగా అమర్చకుండా ఉంటే ఒక సీటుకు మరో సీటుకు మధ్య ఐదడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు