యువతనే టార్గెట్‌ చేసిన కరోనా వైరస్ - వైద్యుడు సస్పెన్షన్

బుధవారం, 8 ఏప్రియల్ 2020 (17:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. బుధవారం మధ్యాహ్నానికి ఈ వైరస్ కేసుల సంఖ్య 329కి చేరింది. బుధవారం నాటికి కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. 
 
74 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. 49 కేసులతో నెల్లూరు, 41 కేసులతో గుంటూరు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ మహమ్మారి బారినపడిన వారిలో అత్యధికులు 40 ఏళ్ల కంటే తక్కువ వయసువారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 
 
ఈ కరోనా వైరస్ సోకుతున్న వారి వివరాలను పరిశీలిస్తే, సున్నా నుంచి 20 సంవత్సరాల వయస్సులోపువారు 8 శాతం ఉండగా, 21 నుంచి 40 యేళ్ల వయస్కులు 48 శాతంగా ఉన్నారు. అలాగే, 41 నుంచి 60 యేళ్లలోపువారు 36 శాతంకాగా, 60 శాతం కంటే ఎక్కువ వయసు వాళ్లు ఎనిమిది శాతంగా ఉన్నారు. 
 
మరోవైపు, విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవంటూ మీడియా ముందు వాపోయిన డాక్టరుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవనీ, వైద్యులకు ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారంటూ అక్కడ పనిచేసే వైద్యుడు సుధాకర్ రావు సస్పెన్షన్ వేటు వేశారు. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషన్ ఉత్తర్వులు జారీఅయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు