తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణాసంచా పేలుడు... ఎలా జరిగింది?

మంగళవారం, 7 నవంబరు 2023 (09:39 IST)
విశాఖపట్టణం - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో బాణాసంచా పేలుడు సంభవించింది. ఓ సంచిలో ఉన్న బాణాసంచా ఒత్తిడికి పేలి పొగలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటను తుని రైల్వే స్టేషన్‌లో జరిగింది. ప్రయాణికులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
విశాఖపట్నం నుంచి బయల్దేరిన రైలు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుని స్టేషన్‌కు వచ్చి చేరింది. తిరిగి రైలు బయలుదేరుతున్న సమయంలో ఎస్‌ 3 బోగీలోని మరుగుదొడ్డి వద్ద ఉన్న సంచిలో నుంచి పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన ప్రయాణికులు భయభ్రాంతులకుగురై దిగేందుకు ప్రయత్నించారు. మరికొందరు ప్రయాణికులు అప్రమత్తమై చైను లాగి రైలును ఆపారు. 
 
వెంటనే బాణసంచా పేలకుండా ప్రయాణికులు కాళ్లతో తొక్కి ఆ సంచీని బయటకు తోసేశారు. అప్పటికీ బోగీలో చిన్న పొగ వస్తుండటంతో కాళ్లతో తొక్కి అదుపు చేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్‌, రైల్వే సిబ్బంది బోగీని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రైలు బయల్దేరింది. ట్రాక్‌ పక్కన పడి ఉన్న బాణసంచా (చిన్న చిచ్చుబుడ్డులు)ను జీఆర్పీ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా జీఆర్పీ సిబ్బంది మాట్లాడుతూ గుర్తుతెలియని ప్రయాణికుడు ఓ సంచిలో బాణసంచా, మందులు (ఔషధాలు) తీసుకువెళ్తుండగా స్వల్ప పేలుడు సంభవించిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు