వలస కూలీలకు సిఎస్ సాయం

శుక్రవారం, 15 మే 2020 (21:46 IST)
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో.. స్వంత గూటికి చేరుకుని అయిన వారితో కలిసి కలో గంజో తాగైనా బతకొచ్చని.. ఎంత కష్టమైనా  రాత్రనక పగలనక కాలినడకన సొంతూరు చేరుకోవాలనే లక్ష్యంతో ఎంతోమంది వలస కూలీలు నగరాలు పట్టణాల నుండి సొంతూరు బాట పట్టారు.అలాంటి వలస కూలీల పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తన మానవతను చాటుకున్న సంఘటన శుక్రవారం విజయవాడ సమీపంలో చెన్నై-కోలకతా జాతీయ రహదారపై చోటుచేసుకుంది.
 
శుక్రవారం తాడేపల్లి లోని ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె విజయవాడ కు తన వాహన శ్రేణితో వస్తుండగా జాతీయ రహదారపై గుంపులు గుంపులుగా పిల్లా పాపలతో తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని రాత్రనక పగలనక మండుటెండను సహితం లెక్క చేయకుండా వందలాది కిలోమీటర్లు నడిచి వెళుతున్న వలస కూలీలు తారస పడ్డారు. 
 
వెంటనే సిఎస్ నీలం సాహ్ని తన కారు ఆపి వలసకూలీలతో వారి మాతృ భాషలోనే మాట్లాడి వారు ఎక్కడ నుండి ఎక్కడకు వెళుతుందీ వారి బాగోగులను అడిగి తెలుసుకుని చలించిపోయిరు. చెన్నై నుండి వారి స్వరాష్ట్రం బీహార్ కు వెళుతున్నట్టు కూలీలు వివరించారు. దీనిపై సిఎస్ వెంటనే కృష్ణా,గుంటూరు జిల్లాలో సంయుక్త కలెక్టర్లకు ఫోన్ చేసి ఈవిధంగా నడిచి వెళుతున్న వలస కూలీలందరికీ ఆశ్రయం కల్పించి వారికి భోజనం ఇతర వసతులు కల్పించాలని, తదుపరి ఏర్పాటు చేసే శ్రామిక్ రైళ్ళలో వారిని వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
ఈ విధంగా తమ కష్టాలను అడిగి తెలుసుకుని తమకు ఆశ్రయం కల్పించి స్వరాష్ట్రానికి చేర్చేందుకు రాష్ట్ర ఉన్నతాధికారి తమ పట్ల ఎంతో మానవతను చాటుకోవడం పట్ల అక్కడున్న వలసకూలీలు అందరూ కన్నీటి పర్యంతమై సిఎస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన రాష్ట్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు