వచ్చే సెప్టెంబరు నుంచి విశాఖలోనే కాపురం : సీఎం జగన్ వెల్లడి

బుధవారం, 19 ఏప్రియల్ 2023 (14:06 IST)
వచ్చే సెప్టెంబరు నుంచి విశాఖపట్టణంలో కాపురం పెట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలాపేటలో కొత్తగా పోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం భూమిపూజ తర్వాత నౌపడలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగంలో మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
వచ్చే సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని.. అక్కడే కాపురం పెట్టబోతున్నానని చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే అక్కడికి వస్తున్నట్లు జగన్‌ చెప్పారు. "24 నెలల్లో మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పోర్టు సామర్థ్యం వంద మిలియన్‌ టన్నులకు చేరే అవకాశం ఉంది. పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమల వల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. మూలపేట పోర్టుతో పాటు జిల్లాకు మరో రెండు ఫిషింగ్‌ హార్బర్లు వస్తాయి. ఈ నాలుగేళ్ల కాలంలో 10 ఫిషింగ్‌ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. 
 
ఆగస్టులో వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తిచేస్తాం. ఉద్దానం కిడ్నీ రోగులకు సేవలందించేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. రూ.700 కోట్లతో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తున్నాం. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆరు లైన్ల రోడ్లను నిర్మించబోతున్నాం" అని జగన్మోహన్ రెడ్డి ఏకరవు పెట్టారు.
 
అయితే, జగన్ ప్రకటించిన వాటిలో ఏ ఒక్కటి నిర్మీత కాల వ్యవధిలో పూర్తయ్యే అవకాశం లేదు. వచ్చేయేడాది అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ యేడాది ద్వితీయం నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలవుతుంది. అలాగే, ఏపీలో కూడా అసెంబ్లీ హడావుడి ప్రారంభమవుతుంది. అందువల్ల సీఎం చెప్పిన అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కటీ పూర్తయ్యే అవకాశం లేదని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. 
 
మరోవైపు, సీఎం జగన్ మరోమారు తన మకాం నుంచి తాడేపల్లి నుంచి విశాఖకు మారుస్తానని చెప్పడం వెనుక కూడా పరమార్థం లేకపోలేదు. తన సొంత బాబోయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్న చిన్నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అలాగే, తన తమ్ముడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఎపుడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశమే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్ నోట మరోమారు విశాఖ పాట వచ్చిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు