గర్భిణీలు, చిన్నారుల‌కు స‌రిప‌డా పౌష్టికాహారం పంపిణీ..మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్

శనివారం, 14 సెప్టెంబరు 2019 (18:13 IST)
అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రతి చిన్నారికీ, గర్భిణీల‌కు, బాలింతలకు ప్రభుత్వం నిర్థేశించిన మెనూ ప్రకారం  పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కృతికా శుక్లా అన్నారు.

స్థానిక చెంచుపేట కాలనీలోని అంగన్ వాడీ కేంద్రాన్నికృతికా శుక్లా  జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు(ఇన్చార్జి) ఐ.ఆర్. భార్గవితో కలసి శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కమీషనర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీస్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు రక్తహీనత లేకుండా వారిలో  హిమోగ్లోబిన్ శాతాన్నిపెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

అక్షయపాత్ర ఫైలెట్ ప్రాజెక్టుగా గుడివాడ పట్టణంలో గల ప్రతి అంగన్ వాడీ కేంద్రంలోను ప్రభుత్వం నిర్థేశించిన మెనూ ప్రకారం బలవర్థకమైన  పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రానికి సంబందించిన వివరాలను, చిన్నారులు వయస్సుకు తగ్గ బరువు,  బాలింతలు, గర్భణీ స్త్రీలలో హీమోగ్లోబిన్ శాతాన్నినమోదు చేసేందుకు గాను రాష్ట్రంలోని ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి కామన్ అప్లికేషన్ సాప్టువేర్ గల  సెల్ ఫోన్ లను అందించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా  కమీషనర్ కృతికా శుక్లా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న 15 మంది చిన్నారులను, ఐదుగురు బాలింతలు, గర్భణీస్త్రీలతో  మాట్లాడుతూ మీకు ప్రతి రోజు గుడ్డు పాలు ఇస్తున్నారా.. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు.

చిన్నారులతో ముచ్చటిస్తూ మీకు ఆటలు, పాటలు నేర్పుతున్నారా .. అని అడిగి వారు ఇచ్చిన సమాదానంతో చెంచుపేట అంగన్ వాడీకేంద్రం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.  ఐదు సంవత్సరముల లోపు గల చిన్నారులను ఇద్దరిని కాప్స్ ఫోన్ ద్వారా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నదీలేనిదీ స్వయంగా పరీక్షించి తెలుసుకున్నారు.

అనంతరం  పిల్లలకు,  బాలింతలకు, గర్భణీస్త్రీలకు పెడుతున్న భోజనాన్నిపరీక్షించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ రిటైర్డు పిడి కె.కృష్ణకుమారి, జిల్లా మేనేజరు(సిఎపి) ఎప్సిబా, సిడిపివో  యం.సముద్రవేణి, అంగన్వాడీ కేంద్ర నిర్వాహుకులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు