డాక్టర్ సుధాకర్‌కు వైద్యం చేయనున్న మహిళా వైద్యురాలు!

ఆదివారం, 31 మే 2020 (12:04 IST)
విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌కు చికిత్స చేస్తున్న వైద్యుడిని మార్చివేశారు. ఆయన స్థానంలో ఓ మహిళా వైద్యురాలిని నియమించారు. ఆమె పేరు మాధవీలత. 
 
తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడి విషయంలో డాక్టర్ సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన స్థానంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవీలత ఆయనకు వైద్యసేవలు అందించనున్నట్టు అధికారులు తెలిపారు.
 
కాగా, అంతకుముందు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి మాట్లాడుతూ తన కుమారుడిపై స్లో పాయిజన్ ప్రయోగం జరుగుతోందని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమ కుమారుడిపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
 
రంగంలోకి దిగిన సీబీఐ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. డాక్టర్ సుధాకర్ పట్ల దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి విచారించాలని సీబీఐని ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో సీబీఐ శనివారం రంగంలోకి దిగింది. సుధాకర్‌ను ఉంచిన మానసిక చికిత్సాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు దాదాపు 5 గంటలసేపు ఆయన నుంచి పూర్తి వివరాలను తీసుకున్నారు. మాస్కులు ఇవ్వలేదంటూ గొడవ చేసిన రోజు నుంచి జరిగిన అన్ని పరిణామాలపై సమాచారాన్ని సేకరించారు.
 
మరోవైపు హైకోర్టు ఆదేశాలతో కేసును విచారించిన సీబీఐ... పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఐపీసీ 120బి, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కావాలని దూషించడం, నేరపూరిత కుట్ర, దొంగతనం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ నిర్బంధం వంటి అభియోగాలను నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు