రచ్చకెక్కిన వైకాపా ఎమ్మెల్యీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం

ఠాగూర్

ఆదివారం, 11 ఆగస్టు 2024 (15:31 IST)
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు వీధికెక్కాయి. కట్టుకున్న భార్యను పిల్లలను విదిలేసి పరాయి మహిళతో కలిసివుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య వాణి బహిర్గతం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 
 
శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడంటూ ఆయన భార్య వాణి, కుమార్తె హైందవి మీడియాకెక్కడం తెలిసిందే. తాజాగా దువ్వాడ కుటుంబ వ్యవహారానికి సంబంధించి టెక్కలి పోలీస్ స్టేషన్‌లో 9 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, భార్య వాణి, కుమార్తె హైందవిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్.... తన భార్య వాణి, కుమార్తె హైందవిపై ఫిర్యాదు చేయగా.... వారు కూడా దువ్వాడపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే టెక్కలిలోని దువ్వాడ నివాసం వద్ద పోలీసులు మోహరించారు.
 
కాగా, గత అర్థరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. గత రెండ్రోజులుగా భార్య వాణిని, కుమార్తె హైందవిని ఇంట్లోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ అనుమతించడంలేదు. శనివారం రాత్రి 9 గంటల వరకు వాణి, హైందవి మూసి ఉంచిన గేట్ల వద్ద ఎదురుచూసి అక్కడ్నించి వెళ్లిపోయారు. గంట తర్వాత వారు మళ్లీ అక్కడికి రాగా, ఓ గేటు తెరిచి ఉంచడంతో వారిద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు.
 
అయితే, ఎమ్మెల్సీ దువ్వాడ తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దువ్వాడ సోదరుడికి... వాణి, హైందవిలకు మధ్య వాగ్వాదం జరిగింది. "ఆడవాళ్లకు ఉండాల్సిన లక్షణాలే లేవు" అంటూ దువ్వాడ సోదరుడు వ్యాఖ్యానించగా... "నీకు ఉంది మగవాళ్లకు ఉండాల్సిన లక్షణం!" అంటూ దువ్వాడ భార్య వాణి దెప్పిపొడిచారు. దువ్వాడకు, భార్య వాణికి గత ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది. రహదారి పక్కనే కొత్త ఇల్లు నిర్మించుకున్న దువ్వాడ... అందులో మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు