ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు... 5 నిమిషాల్లో చార్జింగ్... 25 కి.మీ

బుధవారం, 29 ఆగస్టు 2018 (21:15 IST)
అమరావతి : రాష్ట్రంలో మరో రెండుమూడు నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ముందుగా విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా రెండు బస్సులను నడపనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మరో రెండు బస్సులు నడపడంతో పాటు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్ సమ్మిట్లో ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిపై ఏపీఎస్‌ ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్‌కో, నెడ్ క్యాప్‌తో బెలారస్‌కు చెందిన యాక్సిస్ మొబలిటీ సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. దీనిలో భాగంగానే సచివాలయంలోని అయిదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జరిగిన సమావేశంలో యాక్సిస్ మొబలిటీ సంస్థ ప్రతినిధులతో ఏపీఎస్ ఆర్టీసీ, ట్రాన్స్ కో, నెడ క్యాప్ అధికారులు చర్చించారు. 
 
పర్యావరణ పరిరక్షణతో పాటు డీజిల వినియోగం తగ్గించడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద తెలిపారు. దీనిలో భాగంగా ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, సామర్థ్యం గురించి యాక్సిస్ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పనితీరుపై ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన ద్వారా వివరించారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో తమ సంస్థకు 40 ఏళ్లకు పైగా అనుభవముందని ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ రెడ్డి తెలిపారు.
 
9 మీటర్లు, 12 మీటర్లు, 18 మీటర్లు పొడవు కలిగిన మూడు మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. వాటిలో 12 మీటర్ల పొడవు కలిగిన బస్సులు ఏపీ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయన్నారు. ఈ బస్సులో 75 నుంచి 87 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్ల వరకూ బస్సు ప్రయాణిస్తుందన్నారు. అయిదు నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తవుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో ఎటువంటి కాలుష్య ఉండదన్నారు. విజయవాడలో ప్రయోగాత్మకంగా రెండు ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. 
 
ఇందుకు నగరంలో ఒక ఛార్జింగ్ సెంటర్‌ను నెలకొల్పనున్నామన్నారు. డీజిల్ బస్సు కంటే ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ మూడోవంతు మాత్రమే వ్యయమవుతుందన్నారు. బస్సులోకి వీల్ చైర్‌తో వెళ్లే విధంగా ప్లాట్‌ఫాం కూడా రూపొందించామన్నారు. కిలో మీటర్‌కు రూ.40ల వరకూ వ్యయమవుతుందన్నారు. దీన్ని రూ.35లకు తగ్గించే విధంగా సాంకేతిక వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. ఏసీ సౌకర్యంతో పాటు వైఫై, జీపీఎస్ సిస్టమ్ ఉంటుందన్నారు. ఈ బస్సు కాలపరిమితి 15 ఏళ్లని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు స్పీడ్ లిమిట్ గంటకు 60 కిలో మీటర్లని వివరించారు. 
 
రెండు మూడు నెలల్లో రెండు బస్సులను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. మిగిలిన రెండు బస్సులు మరో రెండు నెలల్లో నడపనున్నామన్నారు. బస్సులను ఉచితంగా అందజేస్తున్నందున్న వాటి దిగుమతికయ్యే కస్టమ్స్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయించాలని ఆయన కోరారు. ఈ విషయమై, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనునట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. 
 
రాష్ట్ర విద్యుత శాఖ ముఖ్య కార్యదర్శి అజయ జైన్ మాట్లాడుతూ, దేశంలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. సోలార్, పవన విద్యుత్పుత్తిలోనూ ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పాటు ఉత్పత్తికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో నెడ్ క్యాప్ ఎం.డి కమలాకర రావు, ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్, ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు, యాక్సిస్ మొబలిటీ, బెల్కమ్ మాన్ మాష్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు