ఎచ్చెర్ల వీఆర్వో బ్రెయిన్ డెడ్.. అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం

సోమవారం, 27 నవంబరు 2023 (11:27 IST)
శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి చనిపోతూ అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం చేసింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక అవయవ దానానికి మృతురాలి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. 
 
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్త పేట గ్రామానికి చెందిన బొడిగి మౌనిక వీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 22వ తేదీన శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ కూడలికి సమీపంలోని వినాయక ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీఆర్వో మౌనిక తలకు బలమైన గాయాలయ్యాయి. 
 
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారి కుటుంబీకులకు సమాచారం అందించడంతో పాటు.. వైద్య చికిత్స అందేలా చేశారు. 
 
తొలుత శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో, తదుపరి శ్రీకాకుళం మేడికవర్ ఆసుపత్రి, అనంతరం విశాఖపట్నం లోని అపోలో ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినప్పటికీ అప్పటికే మౌనిక బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు మౌనిక పరిస్థితిని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 
 
ఈ క్రమంలో విశాఖ నుంచి తిరిగి శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో మౌనికను చేర్పించారు. ఈ సందర్భంగా అవయవదానంపై వైద్యులు ఆమె కుటుంబీకులకు తెలియజేశారు. ఇందుకు మౌనిక కుటుంబసభ్యులు అంగీకరించారు.
 
తమ కుమార్తె మరణించినా.. మరో అయిదుగురుకి ప్రాణం ఇచ్చే అవకాశం ఉందని తెలుసుకుని మౌనిక అవయవాలను దానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. 
 
ఈ క్రమంలో మౌనిక గుండెను విశాఖపట్నం వరకూ రోడ్డు మార్గం గుండా తరలించి.. అక్కడి నుండి వాయు మార్గం ద్వారా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి చేర్చారు. 
 
అదేవిధంగా ఒక మూత్ర పిండంను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి, మరొకటి శ్రీకాకుళం జెమ్స్‌లోని మరో రోగికి, రెండు కళ్ళను రెడ్ క్రాస్‌కు అందించారు. 
 
విషాద సమయంలోనూ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మౌనిక తల్లితండ్రులను అందరూ అభినందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు