ఏపీకి మూడు రాజధానులు ఓ కల : పవన్ కళ్యాణ్

శుక్రవారం, 24 జులై 2020 (09:44 IST)
ఏపీకి మూడు రాజధానుల అంశంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. మూడు రాజధానుల అంశం ఓ కలేనని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు చేస్తామని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పి ఉండాల్సిందని తెలిపారు. అప్పుడు రాజధాని అమరావతికి రైతులు అన్ని వేల ఎకరాలు భూమి ఇచ్చేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు. 
 
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెప్పి రాజధాని మారుస్తామనడం రైతులను వంచించడమే మంచిది కాదు. వారితో ఎవరైనా కన్నీరు పెట్టిస్తే అది మలమల మాడ్చేస్తుంది అని హెచ్చరించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ‘గతంలో టీడీపీ నాయకులు సింగపూర్‌ తరహా రాజధాని అని చెప్పి కాన్సెప్ట్‌ ఎలా అమ్మారో.. ఈ అధికార వికేంద్రీకరణ కూడా మరో కాన్సెప్ట్‌ అమ్మడమే. ప్రజలకు ఒక కల చూపడం తప్ప వాస్తవంలో అవేవీ రూపుదాల్చవు అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, విపక్ష టీడీపీ, అధికార వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారన్నారు. రాజధానిగా అమరావతిని ఆనాడు అందరూ అంగీకరించారని గుర్తుచేశారు. 200 రోజులకుపైగా పోలీసు వ్యవస్థతో రైతులపై దాడులు జరిపించి.. ఆడవాళ్లు, చిన్న పిల్లలు అని లేకుండా.. విద్యార్థులు, వృద్ధులని లేకుండా లాఠీలతో కొట్టించారని, ఆ పాపం పాలకులకు ఊరికేపోదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు