శ్రీవారి భక్తులకు శుభవార్త, ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, నేరుగా ఫ్లైఓవర్ ద్వారా...

శుక్రవారం, 28 మే 2021 (14:52 IST)
తిరుపతిలో గరుడ వారధి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులను ప్రారంభించారు. అయితే ఈ పనులు కరోనా కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యంగా నడుస్తున్నా భక్తుల ట్రాఫిక్ కష్టాలు మాత్రం పూర్తిగా తీర్చేందుకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. 
 
తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్మితమవుతున్న గరుడ వారధి పనులను పరిశీలించారు టిటిడి ఛైర్మన్. చకాచకా జరుగుతున్న పనులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఈ సంధర్భంగా టిటిడి ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్‌ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్ళేవారు నేరుగా టోల్ గేట్ ద్వారా నడిచివెళ్ళేవారు అలిపిరి కాలినడకన మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు