చేపల కోసం వల వేస్తే కొండ చిలువ చిక్కింది.. ఎక్కడ?

మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:55 IST)
చేపల కోసం వల వేస్తే కొండ చిలువ వలలో చిక్కుకుపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరం జగ్గరాజుచెరువు వద్ద చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా జగ్గరాజు చెరువులో చేపల కోసం చాలామంది వలలు విసురుతున్నారు. ఇందులో భాగంగా పెదరాయవరం గ్రామానికి చెందిన పీతల చిట్టిబాబు కూడా చేపల కోసం ఈ చెరువులో వల విసిరాడు.
 
ఆపై వలను లాగడం. చిట్టిబాబు తరం కాలేదు. వలలో పెద్ద చేప చిక్కుకుపోయిందని.. అందరినీ పిలిచాడు. దాన్ని అతికష్టం మీద బయటికి లాగే సరికి  వారి గుండె ఝల్లుమంది. తీరా చూస్తే.. వలలో చేపకు బదులు కొండచిలువ చిక్కుకుంది. దాన్ని బయటకు తీయడం వారి వల్ల కాకపోవడంతో... చివరకు గునపాలతో పొడిచి చంపేశారు. అనంతరం ఈ కొండచిలువను పెదరాయవరం ఎస్సీ పేటకు తరలించారు. 
 
ఈ సందర్భంగా దాన్ని చూడ్డానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, నీటి ప్రవాహంలో ఈ కొండచిలువ కొట్టుకువచ్చి వలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు