మ‌హిళా వాలంటీర్ చిందులు తొక్కిన మున్సిపల్ కమిషనర్ పై విచార‌ణ‌

శనివారం, 28 ఆగస్టు 2021 (11:03 IST)
మ‌హిళా వాలంటీర్ పైన దురుసుగా ప్రవర్తించి, నోరు పారేసుకున్న నరసరావుపేట మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పైన విచార‌ణ‌కు ఉన్న‌తాధికారులు ఆదేశించారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ రామచంద్రారెడ్డిపై ఆర్డీవోతో విచారణకు గుంటూరు క‌లెక్ట‌ర్ వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. 
 
గుంటూరు జిల్లా నరసరావుపేటలో షేక్ అక్త‌ర్ అనే ఓ మహిళా వాలెంటీరుపై క‌మిష‌న‌ర్ రామచంద్రారెడ్డి నోరుపారేసుకున్నారు. న‌ర‌స‌రావుపేట మూడో వార్డులో వాలంటీరుగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెపై అక్కడి అడ్మిన్‌గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో కమిష‌న‌ర్ ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు.

ఆమెకు ఫోను చేసి అసభ్యంగా మాట్లాడారని షేక్ అక్త‌ర్ ఆరోపిస్తోంది. గత జనవరి నెలలో తాను విధులలో చేరినప్పటి నుండి తనకు నిర్ధేశించిన అన్నిపనులూ సక్రమంగా నిర్వహిస్తున్నా వేధింపులకు గురిచేస్తున్నార‌ని ఫిర్యాదు చేసింది. వార్డు అడ్మిన్ చెప్పారని కమిష‌న‌ర్ రామచంద్రారెడ్డి తనను ఫోనులో బూతులు మాట్లాడుతూ, నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ, బొక్కలో వేసి తోలు వలిపిస్తా! అంటూ బెదిరిస్తున్నారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేశారు.
 
తనతో అసభ్యంగా మాట్లాడిన కమిష‌న‌ర్ రామచంద్రారెడ్డిపై, వార్డు అడ్మిన్ నవ్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియో చూసి, గుంటూరు క‌లెక్ట‌ర్ వివేక్ యాద‌వ్ స్పందించారు. రామ‌చంద్రారెడ్డిపై విచార‌ణ‌కు ఆర్డీవోని నియమించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు