రిక్షా తొక్కిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు.. ఎవరతను?

వరుణ్

బుధవారం, 17 జనవరి 2024 (11:06 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు రిక్షా తొక్కారు. రిక్షాలో కార్మికుడిని కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కారు. విశాఖలో జరిగిన మహా సంక్రాంతి సంబరాల్లో జీవీఎల్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 
 
ఈ మహా సంక్రాంతి సంబరాలకు బుధవారం ముగింపు రోజు కావడంతో ఓ కార్మికుడిని రిక్షాలో కూర్చోబెట్టుకుని రిక్షాతొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో ఉన్న జీవీఎల్.. నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. ఆ తర్వాత ఆ రిక్షా కార్మికుడికి డుబ్బులు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ, "విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రక్షాలోనే ఎక్కించుకుని తొక్కాను. తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుం చెల్లించాను" అని పేర్కొన్నారు. 
 
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు కాంగ్రెస్ దూరం : రాహుల్ 
 
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన ఘట్టానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఈ కార్యక్రమాన్ని సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా మార్చేసిందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ కార్యక్రమం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చుట్టూనే తిరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
"అందువల్లే దీనికి హాజరుకానని మా అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు. హిందూమతానికి చెందిన పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఇది రాజకీయ కార్యక్రమమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అందుచేత దీనికి మేం హాజరవడం కష్టం. అయితే రామాలయాన్ని సందర్శించదలచుకుంటే నిరభ్యంతరంగా వెళ్లవచ్చని మా భాగస్వామ్య పక్షాలకు, మా పార్టీలోని వారికి కూడా స్పష్టం చేశాం" అని రాహుల్‌ ఈ సందర్భంగా చెప్పారు. 
 
ఈ నెల 14న మణిపూర్‌లోని తౌబల్‌లో ఆయన ప్రారంభించిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సోమవారం నాగాలాండ్‌కు చేరుకుంది. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ "ఇండియా" కూటమి పటిష్ఠంగా ఉందని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. టీఎంసీతో విభేదాలను ప్రస్తావించగా.. భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీట్ల సర్దుబాటు చర్చలు కూడా బాగానే జరుగుతున్నాయన్నారు. 
 
కాగా, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్‌ యాత్ర 15 రాష్ట్రాల్లో వంద నియోజకవర్గాల గుండా సాగుతుంది. గత యేడాది రాహుల్‌ నిర్వహింయిన ‘భారత్‌ జోడో యాత్ర’ పూర్తిగా పాదయాత్ర కాగా.. ఈ దఫా ఎక్కువగా బస్సు ద్వారా జరుగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర కూడా చేపడతారు. 6,713 కిలోమీటర్ల మేర సాగి.. మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. 

వెబ్దునియా పై చదవండి