మండిపోతున్న ఉత్తర కోస్తా ... నేడు రేపూ ఇదే పరిస్థితి

ఆదివారం, 11 జూన్ 2023 (13:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మండిపోతుంది. సూర్యతాపంతో ఆ ప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించారు. ఆది, సోమవారాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఆరేబియా సముద్రంలో ఉన్న అతితీవ్ర తుఫాన్, బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం దిశగా గాలులు వీయడంతో మొత్తం భూభాగం పొడిగా మారింది. ఇదేసమయంలో ఉత్తరకోస్తాపైకి వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఉదయం నుంచే వేడి వాతావరణం కొనసాగింది. పది గంటల నుంచే వడగాడ్పులు వీచాయి. 
 
కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు, గాడ్పులు వీచాయి. రాత్రి ఎనిమిది గంటలకు కూడా వాతావరణం వేడిగానే ఉంది. రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఎండలు కొనసాగడం సాధారణమే అయినా వారం నుంచి రోజురోజుకూ ఎండలు, వడగాడ్పులు పెరుగుతున్నాయి. 
 
రాష్ట్రంలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరు నుంచి 11 డిగ్రీలు ఎక్కు వగా నమోదయ్యాయి. వాల్తేరులో సాధారణం కంటే 11 డిగ్రీలు ఎక్కువగా అంటే 43.4 డిగ్రీలు నమోదైంది. విశాఖ జిల్లా పద్మనాభం, విజయనగరం జిల్లా గుర్ల, ప్రకాశం జిల్లా మర్రిపాడులో 44.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా అక్కివరంలో 44.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు