రోలు పగిలింది - రోహిణి కార్తె నానుడి నిజమైంది .. చల్లటి నీరు, మజ్జిగ, రాగిజావ తీసుకోండి

శనివారం, 20 మే 2017 (10:28 IST)
రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అంటారు మన పెద్దలు. ఈ నానుడి నిజమైంది. శుక్రవారం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట పంచాయతీ కొత్తపల్లిలో భానుడి దెబ్బకు ఓ రోలు మూడు ముక్కలైంది. దీంతో రోహిణి కార్తె నానుడి నిజమైంది. ఈ కార్తె ప్రవేశించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కాస్తున్న ఎండలకు ప్రజలు భీతిల్లిపోతున్నారు. కేవలం ఎండలు కాయడమే కాకుండా రోడ్డుపై వెళ్లే వాహనాలు సైతం నిలువునా తగలబడిపోతున్నాయి. అలాగే, వేడిగాలులు వీస్తున్నాయి. 
 
ఈ ఎండల వేడిమికి తాళలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల వరకు ఈ వడగాడ్పుల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చల్లటి నీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. 
 
అలాగే తరచూ చల్లని మజ్జిగ తాగడం మంచిదని తెలిపింది. రాగిజావను అల్పాహారంగా తీసుకోవాలని చెప్పింది. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి, నీడపట్టున ఉండటం ద్వారా వడగాడ్పుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఎండల్లోకి వెళ్లకపోవడమే శ్రేయస్కరమని స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి