ఆ రోజున నేను సైగ చేసివుంటే పరిస్థితి ఏంటి? బాలకృష్ణ

శుక్రవారం, 31 జనవరి 2020 (12:30 IST)
తన సొంత నియోజకవర్గ పర్యటన కోసం వెళ్లిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్‌ను వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు వైకాపా కార్యకర్తలు, నేతలు కలిసి బాలకృష్ణ కాన్వాయ్‌పై దాడి చేసేందుకు యత్నించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
దీనిపై బాలకృష్ణ శుక్రవారం స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'నేను నిన్న సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది. చట్టంపై మాకు గౌరవం ఉంది' అని చెప్పుకొచ్చారు. 
 
ఏ బిడ్డ అయినా తండ్రి ఆశాలను నెరవర్చేందుకు కృషి చేస్తారన్నారు. కానీ, నాడు తండ్రి ప్రారంభించిన పెద్దల సభను నేడు కుమారుడు మూసివేశారని ఆయన అన్నారు. కానీ, తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తామంతా కృషి చేస్తున్నామని తెలిపారు.
 
కాగా, రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ స్థానికులతో కలిసి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంటూ, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులను స్టేషన్‌కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు