పదో తరగతి కూడా పాస్ కాలేదు.. 20 మంది టెక్కీ అమ్మాయిల్ని మోసం చేశాడు..

గురువారం, 15 నవంబరు 2018 (13:23 IST)
పదో తరగతి కూడా పాస్ కాని ఓ వ్యక్తి.. 20 అమ్మాయిలను మోసం చేశాడు. అదీ టెక్కీలను మోసం చేసి డబ్బు గుంజేశాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కి చెందిన ఓ టెక్కీ ఫిబ్రవరిలో మ్యాట్రీమోనీ వెబ్ సైట్లో తన వివరాలను పొందుపరిచింది. ఆమెకు రిషి కుమార్ నేలపాటి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. 
 
కొద్దిరోజుల పాటు వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో టెక్కీ అమ్మాయిని సదరు వ్యక్తి తాను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేస్తున్నానని నమ్మించాడు. ఒకరోజు యువతికి ఫోన్ చేసి.. తల్లి ఆరోగ్యం బాగాలేదని డబ్బులు అవసరమన్నాడు.

ఆమె వెంటనే తన క్రెడిట్ కార్డ్ డీటైల్స్, ఓటీపీ నెంబర్ అతనికి పంపింది. ఇలా ఆమె వద్ద నుంచి రెండున్నర లక్షల మొత్తాన్ని కాజేశాడు. డబ్బులిచ్చాక కలుద్దామని భావించిన ఆ టెక్కీ అమ్మాయికి లేటుగా తాను మోసపోయిన విషయం తెలిసింది. 
 
ఇక లాభం లేదనుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. టెక్కీ లేడీ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. అతడో చీటర్ అని తేల్చేశారు.

విచారణలో అతను నెల్లూరుకు చెందిన జీవన్ కుమార్‌గా గుర్తించారు. అతను పదో తరగతి కూడా పూర్తి చేయలేదని.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంప్యూటర్ ముందు కూర్చుని టెక్కీ అమ్మాయిలకు వల వేసి డబ్బు గుంజేవాడని తేలింది. ఇలా ఇప్పటిదాకా 20 మంది అమ్మాయిలను మోసం చేశాడని తెలియవచ్చింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు