మా ధర్మం కోసం మేము ఎవర్నైనా చంపేస్తాం.. ఓల్డ్ సిటీ మినీ పాకిస్థాన్: రాజా సింగ్

సోమవారం, 8 మే 2017 (10:57 IST)
తమ ధర్మం కోసం అడ్డొచ్చిన వారిని ఎవరినైనా సరే చంపేస్తామని తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోహత్య చేసే ఎవరినైనా చంపేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గోవులో 33,000 మంది దేవతలు ఉన్నారని భగవద్గీత చెబుతుందన్నారు. తమ తల్లిని ఎవరైనా చంపేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. 
 
చట్టాలు వేరే పనుల్లో బిజీగా ఉన్నాయని, అందుకే గో సంరక్షణను తాము చేతుల్లోకి తీసుకున్నామన్నారు. అలాగని తాము తీవ్రవాదులం కాదని ఆయన చెప్పారు. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లే... ధర్మ పరిరక్షణకు ఆయుధం పట్టారని, తమ పవిత్ర గ్రంధాలు కూడా ధర్మ పరిరక్షణకు ఇతరులను చంపడం నేరం కాదన్నారు. అందుకే హిందూ ధర్మాన్ని రక్షించేందుకు ఇతరులను చంపుతామని ఆయన తెలిపారు. 
 
ఇకపోతే... హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ (పాతబస్తీ) భారత్‌లో భాగం కాదని... మినీ పాకిస్థాన్ అని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ టెర్రరిస్టు దొరికినా అతని మూలాలు హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో ఉంటాయని గుర్తు చేశారు. కింద ఎంఐఎం ఆఫీసు ఉంటుంది, దానిపైన టెర్రరిస్టులు నివాసం ఉంటారని ఆయన చెప్పారు. 
 
దేశంలో టెర్రరిజం నడవడానికి కారణం... ఓల్డ్ సిటీలో రాజకీయం చేసే రెండు పార్టీలేనని ఆయన చెప్పారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాత బస్తీలో ఆశ్రయం ఇస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనని వారి మెడపై కత్తిపెట్టి వారితో ఆ నినాదాలు పలికిస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి