అసహజ బంధం.. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది... ఎలా?

బుధవారం, 5 జులై 2017 (08:46 IST)
అసహజబంధం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు అర్థాంతరంగా తనువు చాలించగా, ఓ తల్లిని ఇద్దరు పిల్లలకు దూరం చేసింది. పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇద్దరి ఆత్మహత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... శ్రీకాకుళం జిల్లా సోమన్నపేటకు చెందిన బూరాడ సీతాలక్ష్మి(32)కి బూరాడ ప్రసాద్‌ అనే వ్యక్తితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి పది, ఎనిమిదేళ్ల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
అయితే, కొంతకాలంగా సీతాలక్ష్మికి తన బావ.. బూరాడ భుజంగరావు కుమారుడు ధనుంజయ అలియాస్ రాజు (21)తో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో భర్త ప్రసాద్‌ తన తల్లి వద్ద పిల్లలను విడిచి పెట్టి.. సీతాలక్ష్మిని కర్ణాటక తీసుకెళ్లిపోయాడు. అక్కడ బొంతల పనిచేస్తూ జీవనం సాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ధనుంజయ సోమన్నపేటలో ఉంటూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
 
గతనెల 28న ధనుంజయ ఇంటిలో నుంచి కొంత బంగారం, దుస్తులు పట్టుకొని ఊరు విడిచి వెళ్లిపోయాడు. అదేరోజు కర్ణాటకలో ఉంటున్న సీతాలక్ష్మి కూడా అక్కడి నుంచి భర్తకు చెప్పకుండా అదృశ్యమైంది. ధనుంజయ, సీతాలక్ష్మి ఇద్దరూ కలిసి వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగారు. ఇంతలో ఏమైందో.. ఏమో మంగళవారం పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
మానవ సంబంధాల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తూ.. వరుసకు పిన్ని.. కొడుకుల మధ్య ఏర్పడిన ఈ వివాహేతర సంబంధం... వారి విషాదాంతానికి కారణమైంది. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. బిడ్డపైనే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి