ఒకే దేశం.. ఒకే మార్కెట్‌తో తగ్గిన వ్యవసాయ మార్కెట్ల ఆదాయం

బుధవారం, 4 నవంబరు 2020 (08:37 IST)
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒకే దేశం.. ఒకే మార్కెట్ నినాదంతో వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పూర్తిగా దెబ్బతిందని, ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు 010, 011 ఖాతా కింద వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మార్కెట్ యార్డ్ చైర్మెన్లు విన్నవించారు.

తుడా కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేరిన పంచాయతీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

కార్పొరేషన్ పరిధిలోకి విలీనం చేసే ప్రక్రియ జరుగుతున్నదని ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయులకు మద్దతుగా సీపీఎం నాయకులు కుమార్ రెడ్డి కూడా విచ్చేసి సమస్యను చెవిరెడ్డి కి వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా చంద్రగిరి, తిరుపతి కి గుర్తింపు వచ్చేందుకు కృషి చేసిన శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం చంద్రగిరి పరిధిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రరాష్ట్ర కాపునాడు జిల్లా అధ్యక్షులు సరితా నాగరాజు కోరారు.

ఇందుకు చెవిరెడ్డి తప్పకుండా ఏర్పాటుకు కృషిచేస్తానని స్పష్టం చేశారు. అనంతరం తుడా వీసీ హరికృష్ణ, చంద్రగిరి నియోజక వర్గ పరిధిలో మండల తహశీల్దార్ లతో పలు అంశాలపై సమీక్షించారు. అంతకుముందు పలువురు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.

చెవిరెడ్డి వారితో సానుకూలంగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చెవిరెడ్డిని కలిసిన వారిలో తిరుచానూరు, చంద్రగిరి, పాకాల మార్కెట్ యార్డ్ చైర్మెన్ లు శ్రీవాణి గణపతి, మస్తాన్, ముని, కార్యదర్శులు గోవింద్, జానకిరామ్, జయచంద్ర తదితరులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు