19, 20 తేదీల్లో అంతర్జాల అంతర్జాతీయ కవి సమ్మేళనం

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:52 IST)
కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, ప్రాచీన భాషగా తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు), ఆంధ్ర ప్రదేశ్ భాష సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ నెల 19, 20 తేదీల్లో అమరావతి పొయెటిక్ ప్రిజమ్ 2020 16వ అంతర్జాతీయ అంతర్జాల కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు కవిసమ్మేళన కన్వీనర్ డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ తెలిపారు.

మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మీ ఛాంబర్స్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరస్వతీ సమ్మాన్, కబీర్ సమ్మాన్ గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ కేంద్ర కమిటీ సభ్యులు కె. శివారెడ్డి 19వ తేదీ ఉదయం 10 గంటలకు కవిసమ్మేళనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

డాక్టర్ పాపినేని శివశంకర్, తన సంపాదకత్వంలో వెలుబడిన 32 దేశాల నుంచి పాల్గొన్న 162 కవుల కవితలు 42 ప్రపంచ భాషల్లో ఉన్నాయని, గత కవితా సంపుటాలకు వరుసగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ దక్కాయని గుర్తుచేశారు.

గుజరాత్ సాహిత్య అకాడెమీ ఛైర్మన్ పద్మశ్రీ విష్ణు పాండ్య, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ ఎన్. గోపి, డాక్టర్ పాపినేని శివశంకర్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్, ప్రాచీన భాషగా తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం,

ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం నాయుడు, ఆం.ప్ర. భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు.
 
కల్చరల్ సెంటర్ సిఇఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ 31 దేశాల నుంచి వారివారి భాషల్లోనూ, మనదేశం నుంచి 20 భాషల్లోనూ కవులు -పర్యావరణం"పై ఈ సమావేశాల్లో తమతమ కవితలను రెండు రోజులపాటు చదివి శ్రోతలను అలరిస్తారన్నారు.

20వ తేదీ సాయంకాలం 7 గంటలకు జరిగే సమాపన సమావేశానికి మూర్తిదేవి పుస్కార గ్రహీత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిధిగా, డాక్టర్ దీర్ఘాసి విజయ్ భాస్కర్, డాక్టర్ వెన్నా వల్లభరావు (కేంద్ర సాహిత్య అకాడెమీ (అనువాద) అవార్డు గ్రహీత), కిల్లాడ సత్యనారాయణ, ఐపిఎస్ (ఐజీ ఆఫ్ పోలీసు), కల్చరల్ సెంటర్ ఛైర్ పర్శన్ డాక్టర్ వై. తేజస్విని హాజరవుతారని మాలక్ష్మీ ప్రాపర్టీస్ సీఐఓ సందీప్ మండవ తెలిపారు. ఈ సమావేశంలో కవి సమ్మేళన మోడరేటర్, ది సెడిబస్, సిఇఓ, దీపా బాలసుబ్రమణియన్, తదిరతులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు