కొత్త తరహా నటుడు చంద్రబాబు చౌదరి: మంత్రి పేర్ని నాని

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:48 IST)
అమరావతి శంకుస్థాపన చేసిన చోట చంద్రబాబు ప్లాను ప్రకారం దొర్లి భావోద్వేగం చూపించాలని ప్రయత్నించారని మంత్రి పేర్ని నాని అన్నారు. అసలు ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌, ఎస్వీరంగారావును మించిన కొత్త తరహా నటుడు చంద్రబాబు చౌదరిని మనం చూశామని పేర్ని నాని అన్నారు. 

అమరావతికి దేశం నలుమూలల నుంచి పవిత్రమైన మట్టిని 50వేల చోట్ల నుంచి తెచ్చామన్నారు. పార్లమెంట్‌ మట్టిని కూడా తెచ్చామన్నారు. అంటే పార్లమెంట్‌ కూడా అమరావతికి అండగా ఉన్నట్లే అని బాబు అంటారు. ఎన్నికలు అయ్యేవరకు ప్రధాని మోడీ ఏం చేశారు. ఇంత చెంబుడు మట్టి తెచ్చి మన మొహాన కొట్టారని చంద్రబాబు అన్నారు.

ఎన్నికల ముందు వరకు ఏమో అది చెంబుడు మట్టి, చెంబుడు నీళ్లు. ఇవాళ దానికి పవిత్రత వచ్చింది. ఇవాళ పవిత్రమైన యమునా నదీ నీళ్లు తీసుకొచ్చారంటాడు. పార్లమెంట్‌ మన వెనకాల నించుంటుందని కల్లబొల్లి మాటలు చంద్రబాబు మాట్లాడటం ఏంటి? చంద్రబాబు డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.
 
- దేవుళ్ల పట్ల, పవిత్రమైన విషయాల పట్ల దొంగనాటకాలు ఆడితే ప్రకృతి తగిన శాస్తిని చూపిస్తుందనే విషయాన్ని చంద్రబాబు చౌదరి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్నవారంతా పేదలు, దళితులు అని చంద్రబాబు అంటున్నారు. నిలువు నీడలేక నిరుపేదలైన దళితులు, బలహీన వర్గాల వారికి సెంటు స్థలం తలదాచుకోవటానికి ఇచ్చే ప్రయత్నం చేస్తే.. పేదలు ఇక్కడ నివాసం ఇవ్వటానికి పనికిరావు. పేదలకు అమరావతిలో స్థలాలు ఇస్తే అసమానతలు వస్తాయ్‌. ఇక్కడ మాకున్న కోర్కెలకు, కలలకు ఇది అడ్డంకి అవుతుందని స్వయంగా అఫిడవిట్ దాఖలు చేసిన వారంతా చంద్రబాబుకు రైతులు.

రైతు అనేవాడు ఎక్కడున్నా భూమి మీద మమకారం ఉంటుంది. సాగు కోసం పరితపిస్తాడు. ఇవాళ వీరెవ్వరూ మాకు భూమి వద్దు. ప్లాట్‌ కావాలి. ప్లాట్‌ విలువ పెరగాలి. కోట్లు కావాలనే వాడు ఎలా రైతు అవుతాడని పేర్ని నాని ప్రశ్నించారు. ఇవాళ దళితుల్ని వద్దనేవాడు, పేదల్ని చీదరించుకునేవారు రైతు ఎలా అవుతాడు. రైతు అనేవాడు పేదవాడ్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. 50వేల మంది పేద దళిత బలహీన వర్గాలకు నిలువ నీడ కల్పిస్తానంటే అడ్డుకున్న వారు రైతులు, దళితులు ఎలా అవుతారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నానని నాని అన్నారు.
 
-  ఇంద్రకీలాద్రి వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లింది కొండ కింద ఉన్న నీవారి కోసం కాదా చంద్రబాబు చౌదరి గారూ. అమ్మవారి గురించి మాట్లాడే మనం గత చరిత్ర చూసుకోవాలి. కొండ మీద క్షుద్రపూజలు చేసినందుకే కాదా రాజకీయాల్లో చావు తప్పి కన్ను లొట్టిపోయింది. మనసులో ఒకటి పెట్టుకొని  అమ్మ దర్శనం చేసుకుంటే భవిష్యత్‌లో ఇంకా దుర్గతిని చంద్రబాబు చూస్తారని నాని హెచ్చరించారు. 
 
జగన్‌ ని జగన్ రెడ్డి అని చంద్రబాబు అనటం ఏంటి? 19 నెలలు అయింది ఏం పీకావ్ అని చంద్రబాబు మాట్లాడుతున్నారు. అసలు ఇవి... బాబు వయస్సు తగ్గ మాటలేనా? నీ భాషకే వస్తే.. పవన్‌ నాయుడు, చంద్రబాబు చౌదరి కలిసి జగన్ రెడ్డి అంటున్నారు కదా. చంద్రబాబు చౌదరి జగన్ అవినీతిపై పీకటం మొదలు పెట్టగానే తీగ కదలగానే గుంటనక్కలా కోట్లు కోట్లు కుమ్మరించి పెద్దపెద్ద నల్ల కోట్ల వెనకాల దాక్కున్నది ఎవరు?

స్టేలు తెచ్చుకున్నది ఎవరు? స్టేల కోసం నానా గడ్డీ కరుస్తున్నది చంద్రబాబు చౌదరి కాదా? నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా స్టేలు ఎత్తే రోజు త్వరలోనే వస్తుంది. in front there is crocodile festival చంద్రబాబు చౌదరి గారూ! 
 
- నిజం చెప్పే రాజకీయాలు రాష్ట్రానికి అవసరం లేదా చంద్రబాబు అన్నారు. అవును... నూటికి నూరు శాతం నిజం చెప్పే రాజకీయాలు అవసరం అని పేర్ని నాని అన్నారు. అందుకే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడే చంద్రబాబు చౌదరిని ఇంటికి పంపించి చెప్పింది చేసేవాడిగా నాటి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా ఎంచుకొని 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. నిజానికి ఈ పోరాటం చంద్రబాబు చౌదరి కోసం కాదు. ఆయన కొడుకు లోకేశ్‌ చౌదరి కోసం అన్నది అందరికీ తెల్సు.
 
- 22 ఏళ్లు అధికారంలో ఉన్నారని చంద్రబాబు చౌదరి అన్నారు. అబద్దాల పుట్ట అనటానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. 13 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్న సంగతి చంద్రబాబు చౌదరి మనస్సుకు కూడా తెల్సు. అధికారం ఎన్ని ఏళ్లు ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా రాష్ట్రానికి, పేదవారిని ఆదుకున్నామో చదువు, వైద్యం అందించామో ముఖ్యం. ఊర్లో రావి చెట్టుకు వయస్సు వస్తుంది. మనకూ వయస్సు వస్తుంది. ప్రజల కోసం ఎంత నిజాయితీగా పనిచేశామన్నది ఇప్పటికీ చంద్రబాబు గుర్తించకపోవటం ఆయన దౌర్భాగ్యం. 
 
- మూడు రాజధానులపై రిఫరెండం పెట్టండి. ఓడిపోతే రాజకీయాల నుంచి ఇంటికి వెళ్తానని అంటారు. ఇంతకీ చంద్రబాబు చౌదరి వయస్సు ఎంత? 70 ఏళ్లు దాటాయ్‌. చంద్రబాబు రాజకీయాలు మానితే ఏంటి? మానకపోతే ఏంటి? ఈ వయస్సులో ఇంకా కోరికలు ఏంటి? ఇక్కటితో చంద్రబాబు చౌదరి దిగజారుడు భాష కట్టిపెట్టాలి. రాష్ట్రానికి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టి ప్రోత్సహించాలని చంద్రబాబుకు పేర్ని నాని సూచించారు. 
 
- జగన్ కి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు సర్టిఫికెట్ అవసరం లేదన్న సంగతి ఆయన గుర్తిస్తే మంచిదని పేర్ని నాని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏం సర్టిఫికెట్ ఇచ్చారన్నదే మాకు ముఖ్యం తప్పితే అధికారం కోల్పోయి కొడుకు కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు దొంగ సర్టిఫికెట్‌ మాకు అవసరం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు