స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం కావాల‌ని బుర‌ద జ‌ల్లుతున్నారు: జ‌గ‌న్‌

బుధవారం, 25 ఆగస్టు 2021 (20:24 IST)
కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో బుధవారం సీఎం జగన్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్‌ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కరోనాపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడారు. ‘గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా మనం కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం పర్యవేక్షణ, సమీక్షచేయాలి. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ మనం అప్రమత్తంగానే ఉండాలి.

కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి. పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలి. పెళ్లిళ్లలో 150కి మించి ఉండకుండా చూడాలి. విద్యాసంస్థల్లో ఎస్‌ఓపీలను తప్పకుండా పాటించాలి. ఫోకస్‌గా టెస్టింగ్‌ చేయాలి. ఇంటింటికీ సర్వేలు కొనసాగాలి. ఎవరికి లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయాలి. ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని టీచర్‌చెప్తే... మార్గదర్శకాల ప్రకారం అక్కడ పరీక్షలు చేయాలి. విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా వెంటనే పరీక్షలు చేయాలి.

104 టోల్‌ఫ్రీ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. నిరంతరం పర్యవేక్షణ చేయాలి. నిర్దేశించుకున్న ఎస్‌ఓపీలను పాటించాలి. ఎవరైనా ఫోన్‌చేసినప్పుడు నిర్దేశించుకున్న ప్రోటోకాల్స్‌ పాటించాలి. కోవిడ్‌ తగ్గింది కాబట్టి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు. ‘థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో తెలియదు గానీ మనం మాత్రం సన్నద్ధంగా ఉండాలి. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలి. ఆస్పత్రులను, సిబ్బందిని సన్నద్ధంగా ఉంచుకోవాలి. నర్సులకు శిక్షణ కూడా ఇవ్వాలి.

బెడ్లను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్‌సంట్రేటర్లు అందుబాటులో ఉంచుకోవాలి. 100  బెడ్లు దాటిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి వరకూ 71,03,996 మందికి డబుల్‌ డోస్, 1,18,53,028 మందికి సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్లు ఇచ్చాం.

85 శాతం ప్రజలకు డబుల్‌డోస్‌ ఇచ్చేంతవరకూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాలి. సచివాలయాన్ని యూనిట్‌గా పెట్టుకుని ప్రతి ఇంటిలో ఉన్నవారికీ వ్యాక్సిన్లు పూర్తిచేసేలా ముందడుగు వేయండి. దీనివల్ల వ్యాక్సిన్ల వృథాను అరికట్టగలుగుతాం. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి. వర్షాకాల సమావేశాల్లో వచ్చే వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అన్నిరకాల చర్యలు తీసుకోండి. పారిశుద్ధ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి’ అని సీఎం జగన్‌ తెలిపారు.

గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఎన్‌ఆర్‌జీఎస్‌ డబ్బును మన ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని సీఎం జగన్‌ చెప్పారు. కేంద్రం నుంచి కూడా మనకు నిధులు రావాల్సి ఉందని, 15 రోజుల్లో ఈ చెల్లింపులపై దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ పనులపై పూర్తిగా దృష్టిపెడితే గ్రామం రూపు రేఖలు పూర్తిగా మారుతాయని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు