జగన్ పేదల రక్తం తాగుతున్నారు: జవహర్

మంగళవారం, 23 మార్చి 2021 (10:34 IST)
మద్యపాన నిషేదం పేరుతో మహిళల ఓట్లు దండుకున్న సీఎం జగన్.. మద్యం అమ్మకాలు, రేట్లు పెంచి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం మద్యం ధరలు పెంచి పేదల రక్తం తాగుతున్నారన్నారు. మద్యం రేట్లు పెరగడంతో సామాన్యులు తన రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ వారి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.

మద్యానికి అలవాటుపడిన వారు మద్యలో మానలేక, పెరిగిన ధరలకు మద్యం కొనలేక డబ్బుల కోసం ఇంట్లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని, మరికొంత మంది శానిటైజర్ తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలో ఇవాళ ఇద్దరు శానిటైజర్ తాగి చనిపోయారని జవహర్ అన్నారు. మద్యం రేట్లు పెరిగాక రాష్ట్రంలో శానిటైజర్, నాటుసారా తాగి సుమారు 50 మంది చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

పక్కనున్న తెలంగాణలో దేశంలో లభించే బ్రాండ్లన్నీ లభిస్తుంటే ఏపీలో మాత్రం జగన్ సొంత బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో వైసీపీ నేతలు, వాలంటీర్లే మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని, మద్యం రేట్లు పెంచి, అమ్మకాలు పెంచి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవాలన్న ధ్యాస తప్ప మద్యపాన నిషేధం అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్ధమైందని జవహర్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు