దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్

బుధవారం, 21 అక్టోబరు 2020 (20:53 IST)
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలానక్షత్రం రోజున ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమను సమర్పించారు.

బుధ‌వారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్గుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

తొలుత ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, స్థానిక శాసనసభ్యులు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు, స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో వేద మంత్రోచ్ఛరణతో స్వాగతం పలికారు.

పాత రాజగోపురం వద్ద స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ముఖ్యమంత్రికి పరివట్టం నిర్వహించి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో అంతరాలయంలోకి తోడ్కొని వెళ్ళారు. సరస్వతిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని సాంప్రదాయ వస్త్రధారణతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.

అంతరాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి, కూచిభట్ల నరసింహ అవదాని, రామనాథ్ ఘనాపాటి, సి.హెచ్.చంద్రశేఖర్ అవధాని, రామదత్త ఘనాపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద‌ర్శ‌నం అనంత‌రం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు వైదిక కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

తొలుత కొండమీదకు చేరుకున్న సిఎం జగన్మోహన్ రెడ్డి కొండచరియలు విరిగిప‌డిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి, వల్లభనేని వంశీమోహన్, దూలం నాగేశ్వరరావు, వసంత వెంకటకృష్ణ ప్రసాద్, కె.రక్షణ‌నిధి, కె.అనీల్‌కుమార్, కె.అబ్బయ్‌చౌదరి, దేవాదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్, నగర పోలీస్ క‌మిష‌న‌ర్ బత్తిన శ్రీనివాసులు, మున్సిప‌ల్ క‌మిషనర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత, సబ్ కలెక్టర్ హెచ్.ఎం.ధ్యాన‌చంద్ర తదితరులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు