అయ్యా... నా విన్నపాన్ని మన్నిస్తారని కోరుకుంటూ... ఇట్లు పవన్ కళ్యాణ్

మంగళవారం, 13 మార్చి 2018 (20:15 IST)
మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఏపీ డిజిపికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆ లేఖలో పవన్ కళ్యాణ్.... " అయ్యా, మార్చి 14వ తారీఖు జనసేన ఆవిర్భావ సభలో మీరందిస్తున్న భద్రతకు పోలీసు శాఖవారు తీసుకుంటున్న జాగ్రత్తలకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. మార్చి 14వ తారీఖున తర్వాత కూడా నాకందిస్తున్న వ్యక్తిగత భద్రతను కొనసాగించవలసినదిగా కోరుతున్నాను. నేను భద్రత కోరుతున్నది ప్రదర్శనా కుతూహలంతో మాత్రం కాదు. ప్రస్తుత సమాజంలో వున్న కుల ఉద్యమాలు, వర్గ పోరాటాలు, రాజకీయ అణచివేతల నడుమ నా భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడిపడి వుంది. 
 
నా మీద ఏదైనా దాడి జరిగితే ప్రజా జీవితంపై అది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం వుంది. గతంలో భీమవరం పట్నంలో నా ఫ్లెక్సీ చింపివేసినందుకే దాదాపు 2 వేల మంది నా అభిమానులు ధర్నా చేసినందుకు శాంతిభద్రతలకు విఘాతం అవుతుందనే ఉద్దేశ్యంతో పోలీసువారు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం మీ దృష్టిలోకి వచ్చే వుంటుంది. 
 
అలాగే కాకినాడలో నా సభ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట, విజయవాడ ఉద్దానం బాధితుల విషయమై గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని నేను కలవడానికి వచ్చినపుడు దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బందిపడిన సందర్భం, ఇటీవలే నేను అనంతపురం ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు జరిగిన తొక్కిసలాట సంఘటనలని దృష్టిలో పెట్టుకుని నేను ఈ భద్రతను కోరుతున్నాను.

అలాకాకుండా పోలీసువారు భద్రత అందించడంలో తమ నిస్సహాయతని ప్రకటిస్తే, నేను రాష్ట్రంలో పర్యటిస్తుండగా నాకు సంబంధించి అనివార్యమైన సంఘటనలు ఏమైనా జరిగితే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందువల్ల పై విషయాలను మీరు సానుభూతితో పరిశీలిస్తారని, నా విన్నపాన్ని మన్నిస్తారని కోరుకుంటూ... ఇట్లు పవన్ కళ్యాణ్." అని రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు