తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్

ఆదివారం, 24 ఆగస్టు 2025 (23:12 IST)
హైదరాబాద్ నగరం జూబ్లీ హిల్స్ నివాసం‌లో సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు ఆదివారం సాయంత్రం కలిశారు. వీరిలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు ఉన్నారు. 
 
ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో చక్కటి పని వాతావరణం ఉండాలి, సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని చెప్పారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుందన్నారు. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి, పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. 
 
స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని, తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. లంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ, పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించామని తెలిపారు. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల విభాగంలో సంస్కరణలు అవసరమన్నారు. 
 
కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని, పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామన్నారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదన్నారు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని అన్నారు. 
 
పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్‌గా ఉంటానని, హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని ఆయన కోరారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు