విద్యుత్ వైర్లు తెగిపడి అన్నదమ్ముల సజీవదహనం .. ఎక్కడ?

శుక్రవారం, 24 జూన్ 2022 (17:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో అన్నదమ్ములు సజీవదహనమయ్యారు. మృతులను వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19)లుగా గుర్తించారు. వీరిద్దరూ పాలు తెచ్చేందుకు పొలం వద్దకు బైకుపై వెళ్లారు. 
 
మార్గమధ్యంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి వీరు ప్రయాణిస్తున్న బైకుపై పడింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి అన్నదమ్ములిద్దరూ మంటల్లో కాలిపోయారు. ఈ విషయం తెలియగానే వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ కుప్పకూలిపోయారు. చేతికి ఎదిగొచ్చిన పిల్లలిద్దరూ మృతి చెందడంతో తల్లిదండ్రులతో కుటుంబీకుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 
 
కాగా మృతుల్లో నాగేంద్ర బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా, ఫణీంద్ర ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇద్దరు యువకుల ప్రాణాలు తీశాయంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు