వైఎస్. షర్మిల కొత్త పార్టీ వెనుక ప్రధాని మోడీ హస్తం : జేసీ కామెంట్స్

మంగళవారం, 16 మార్చి 2021 (19:57 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఆమె తన పార్టీ పేరును ఏప్రిల్ నెలలో ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
వైఎస్ విజయమ్మకు షర్మిల అంటే చాలా ప్రేమ అని వెల్లడించారు. షర్మిలకు ఏదైనా కీలక పదవి ఇచ్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా మరో ఏడాదిన్నరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ అడుగుపెడుతుందని జోస్యం చెప్పారు. అయితే షర్మిల కొత్త పార్టీ పెట్టడం వెనుక ప్రధాని మోడీ హస్తం ఉండివుండొచ్చన్న అనుమానం తనకుందన్నారు. 
 
ప్రస్తుతం షర్మిల వార్మప్ చేస్తోందని జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఏపీలో ఎంటరయ్యేందుకు ఇది కేవలం సన్నాహకమేనని అభివర్ణించారు. ఆ తర్వాత విజయవాడకు షిఫ్టవడం లాంఛనమేనన్నారు. రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరంలేదని, ఏపీలోనే అవసరం అన్నది షర్మిలకు తెలిసి వస్తుందన్నారు. 
 
ఒకవేళ షర్మిలకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తే కొత్త పార్టీ విషయంపై పునరాలోచన చేస్తుందేమో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ సభ్యులందరూ పదవులు కోరుతుంటారని, జాతీయ పార్టీలే నయమని జేసీ అభిప్రాయపడ్డారు. తేకాకుండా, తెలంగాణ వచ్చాక మీరు, మేము ఆగమైపోయామన్నారు. 
 
ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను పుట్టింది పెరిగింది.. నా ఉన్నతికి కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చూసి చాలా బాధేస్తోంది. మీరు (కాంగ్రెస్ నేతలు) కేసీఆర్‌ను ఓడించలేరు. నేను సీఎం.. నేను సీఎం.. అంటూ పార్టీని నాశనం చేశారు" అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు