చాక్లెట్‌ ఇచ్చి నెక్లెస్‌ తీసుకెళ్లినట్లు ఉంది: జగన్‌ పాలనపై కన్నా విసుర్లు

సోమవారం, 2 మార్చి 2020 (05:43 IST)
సీఎం జగన్‌ పాలన చాక్లెట్‌ ఇచ్చి నెక్లెస్‌ తీసుకెళ్లినట్లు ఉందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. మాఫియా దెబ్బకి ఇటుకలు కూడా కొనలేని పరిస్థితి వచ్చిందన్నారు.

రాజధాని గ్రామాల్లో కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూల్చడం, పాడు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

ఇప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీకి వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రావని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారని, ప్రతిపక్ష నేతల్ని బ్లాక్‌మెయిల్‌ చేసేలా సీఎం జగన్‌ మాట్లాడుతున్నారని కన్నా మండిపడ్డారు.

సీఎం మారినప్పుడల్లా రాజధానిని సంకన పెట్టుకుంటే.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ముఖేష్‌ అంబానీకి జగన్‌ ఏ బహుమతి ఇచ్చారు?: వర్లరామయ్య
ముఖేష్‌ అంబానీకి సీఎం జగన్‌ ఏ బహుమతి ఇచ్చారని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య జరిగిన క్విడ్‌ప్రోకో ఏంటని నిలదీశారు.

నీతులు మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని, హైకోర్టు చివాట్లు పెట్టినా జగన్‌ వైఖరి మారలేదని మండిపడ్డారు.

మీ తండ్రిని హత్య చేయించింది రిలయన్స్‌ అని.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కంపెనీపై దాడులు జరిగాయని, ఇప్పుడు అంబానీకి ఎలా స్వాగతం పలుకుతారా అని మరోసారి ప్రశ్నించారు. జగన్‌, అంబానీ మధ్య ఒప్పందం బయటపెట్టాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు