చంద్ర‌బాబు మాట త‌ప్పారు... ఇక కాపు స‌త్యాగ్ర‌హ పాద‌యాత్ర‌

శుక్రవారం, 14 అక్టోబరు 2016 (17:49 IST)
కిర్లంపూడి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. 
 
ఆగస్టులోగా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే తాను పాదయాత్ర చేపడుతున్నానన్నారు. రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర ప్రారంభించి, అంతర్వేదిలో ముగిస్తానని చెప్పారు. 
 
నల్ల రిబ్బన్లు ధరించి ఈ పాదయాత్ర చేస్తానన్నారు. దీంతో కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి ముద్రగడ పద్మనాభం రోడ్డెక్కుతున్నట్లు అయ్యింది. ఇంతకుముందు ఆయన తుని సమీపంలో కాపు ఐక్య గర్జన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఉద్రిక్త ప‌రిస్తితులు త‌లెత్తి ప్రభుత్వం బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించింది

వెబ్దునియా పై చదవండి