మృతదేహాలపై వరిపొట్టు కప్పి భద్రపరిచారు... 'కొండగట్టు'లో హృదయవిదారక దృశ్యాలు

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (13:32 IST)
కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా 57 మంది చనిపోయారు. వీరిలో అనేక మంది పేద ప్రజలు. కనీసం కడుపు నిండా తినేందుకు సైతం ఆర్థికస్తోమతలేనివారు. ముఖ్యంగా, జగిత్యాల జిల్లాలో ఐదు గ్రామాల్లో విషాదకర వాతావరణం నెలకొంది. ఈ గ్రామాల్లో దృశ్యాలు అంతులేనివేదన కలిగిస్తున్నాయి. మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.
 
ప్రమాదంతో కొడిమ్యాల మండలం తిర్మలాపుర్, శనివారంపేట, హిమ్మత్ రావుపేట, రాంసాగర్, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామాల్లో విషాదం నెలకొంది. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువమంది ఈ ఐదు గ్రామాలకు చెందినవారే. పక్కనున్న టౌన్‌కు వెళ్లి చిన్నచిన్న వస్తువులు అమ్ముకుని జీవనం సాగించే చిరు వ్యాపారుల కుటుంబాల్లో ఆరని చిచ్చు రగిలింది. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు మృతదేహాలను తీసుకుని వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 
 
అయినవారి కడచూపు కోసం ఛిద్రమైన మృతదేహాలను ఐస్‌పై భద్రపరిచారు. ఆ మృతదేహాలపై వరిపొట్టు కప్పి భద్రపరిచారు. దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబసభ్యులకు చివరి చూపుల కోసం మృతదేహాలను ఐస్‌ గడ్డలపై నిల్వవుంచారు. ఈ గ్రామాల్లో ఫీజర్ బాక్సులు లేకపోవడంతో ఇలా ఐస్‌పై ఉంచి.. అయినవారి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. 
 
మరోవైపు, మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కొడిమ్యాల మండలంలో వర్షం కురిసింది. పలు గ్రామాల్లో భారీ వర్షం పడింది. వానలోనే కొండగట్టు ప్రమాద మృతుల అంత్యక్రియలు నిర్వహించారు బాధితుల కుటుంబసభ్యులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు