ముఖంపై కర్రతో కొట్టిన ప్రిన్సిపాల్.. విద్యార్థికి దంతాలు విరిగిపోయాయి..

ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:44 IST)
తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడన్న కారణంగా ఓ విద్యార్థి ముఖంపై ప్రిన్సిపాల్ కర్రతో కొట్టాడు. దీంతో ఆ విద్యార్థికి రెండు దంతాలు విరిగిపోయాయి. ఈ దారుణం కృష్ణా జిల్లా నూజివీడులోని రాష్ట్ర మంత్రి విద్యా సంస్థలకు చెందిన పాఠశాలలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్‌ బాబు కుమారుడు రోహిత్‌సాయి నూజివీడు నారాయణ ఈ టెక్నో బ్రాంచ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.
 
శుక్రవారం మధ్యాహ్నం తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని ప్రిన్సిపాల్‌కు ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. ఆగ్రహించిన ప్రిన్సిపల్‌ క్లాస్‌రూంలోకి వెళ్లి కర్రతో రోహిత్‌ మొహంపై బలంగా కొట్టాడు. దీంతో విద్యార్థి కిందపడిపోయాడు. ఈ ఘటనలో విద్యార్థి రోహిత్‌కు రెండు పళ్లు విరిగి రక్తస్రావమైంది. 
 
విద్యార్థికి  వైద్యచికిత్స చేయించకపోగా సాయంత్రం వరకు స్కూల్‌లోనే ఉంచారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం నూజివీడుకు తరలించారు. తమ బిడ్డపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను తండ్రి నిలదీయడంతో స్కూల్‌ యాజమాన్యం రంగంలోకి దిగి ఈ విషయాన్ని మీడియాకు చెప్పవద్దంటూ వారిపై బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సృందన ఉండదని బెదిరింపులకు దిగడంతో ఒత్తిళ్లకు తలొగ్గిన తల్లిదండ్రులు మౌనం దాల్చారు. చివరకు ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో వివాదాస్పదమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు