భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుంటే.. భర్త అగ్గిపుల్ల అందించాడు..

సోమవారం, 7 డిశెంబరు 2020 (11:59 IST)
ఏడడుగులు కలిసి నడిచిన భర్తే.. భార్య అగ్నిలో మండిపోయేందుకు కారకుడయ్యాడు. కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఓ మహిళకు ఆమె భర్తే అగ్గిపుల్ల అందించాడు. అయితే తీరా ఆమె నిప్పటించుకున్నాక మంటలు ఆర్పేందుకు యత్నించి గాయాలపాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన షారుఖ్‌, షహీనాలకు నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యభర్తలు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.
 
మనస్పర్ధల కారణంగా వారు పలుమార్లు గొడవ కూడా పడ్డారు. ఈ క్రమంలోనే షహీనా అత్తమామలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షాహీనా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యకు యత్నించింది. షహీనా ఇంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే ఆమె భర్త షారుఖ్ తనకేమి సంబంధం లేనట్టు చూస్తూ ఉండిపోయాడు. 
 
అంతేకాకుండా ఆమె అడగ్గానే నిప్పంటిచుకోవడానికి అగ్గిపుల్ల కూడా అందించాడు. అయితే షహీనా తన కళ్లముందే నిప్పంటుకోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడికి పలుచోట్ల గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉన్న షహీనాను బంధువులు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  
 
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో షహీనాకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అయితే షహీనా శరీర భాగాలు 60 శాతం కాలిపోవడంతో ఆమెకు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు