మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టాలి.. ఏం చేస్తారో మీయిష్టం : మంత్రులతో సీఎం జగన్

బుధవారం, 20 నవంబరు 2019 (09:43 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచాలని నిర్ణయించారు. అదీకూడా ఎలాగంటే.. మద్యం బాటిల్ ముట్టుకుంటేనే షాక్ కొట్టేలావుండాలన్నారు. ఇందుకోసం దరఖాస్తు రుసుం, లైసెన్స్ ఫీజులను భారీగా పెంచాలని ఆదేశించారు. ఈ విషయంలో సంబంధిత శాఖామంత్రికి ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 
 
బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రస్తుతమున్న బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సంఖ్య తగ్గింపుతోపాటు మద్యం సరఫరా వేళలను కుదించాలని, బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 797 బార్లు ఉండగా, వీటిలో సగానికిపైగా తగ్గించాలని సీఎం సూచించారు. 
 
అంతేకాకుండా, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. 'మద్యం ముట్టుకుంటే షాక్‌ కొడుతుందన్న భావన ఉండాలి. అప్పుడే చాలామంది దానికి దూరం అవుతారు. ఇందుకు అనుగుణంగానే దరఖాస్తు రుసుములు, లైసెన్సు ఫీజులు ఉండాలి. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలన్న మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి' అని సీఎం జగన్ అధికారులకు  స్పష్టమైన ఆదేశాలుజారీచేశారు. 
 
దీనికి అధికారులు సమాధానమిస్తూ, మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే 20 శాతం దుకాణాలను తగ్గించామని, బార్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బార్లలో ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం సరఫరాకు, రాత్రి 11 గంటల వరకూ ఆహారాన్ని అనుమతిస్తామని అధికారులు చెప్పారు. స్టార్‌హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం విక్రయాలకు అనుమతిస్తామని చెప్పారు. 
 
అంతేకాకుండా, నాటుసారా, కల్తీ మద్యం తయారీ, మద్యం స్మగ్లింగ్‌ చేసివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని సూచించారు. బార్‌ యజమానులు నియమాలు ఉల్లంఘిస్తే లైసెన్సు ఫీజుకు ఐదు రెట్లు జరిమానా విధించాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు