ఫ్రెండ్‌ ప్రియురాలిపై కన్నేసిన దోస్త్.. రెండు హత్యలకు కారణమైన ఆ మహిళ...

గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:18 IST)
హైదరాబాద్‌ నగరంలోని అత్తాపూర్ మెట్రో పిల్లర్ 139 వద్ద పట్టపగలు జరిగిన హత్యకు గల కారణాలను నిందితులు వెల్లడించారు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై తన వెంట ఉండే స్నేహితుడే కన్నేశాడు. దీన్ని జీర్ణించుకోలేక స్నేహితుడుని చంపేశాడు. అతని తండ్రి కక్ష పెట్టుకుని ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
హైదరాబాద్ జుమ్మేరాత్‌ బజార్‌, ధూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన జెరిగళ్ల రమేశ్‌ గౌడ్‌ (24), వడ్డేగోని మహేశ్‌ గౌడ్‌ మంచి స్నేహితులు. అదేప్రాంతానికి చెందిన ఓ మహిళతో రమేశ్‌ గౌడ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెపై మహేశ్‌ గౌడ్‌ కూడా కన్నేసి ఆమెను వేధించసాగాడు. మహేశ్ తనను వేధిస్తున్నాడన్న విషయాన్ని రమేశ్‌కు ఆ మహిళ చెప్పింది. 
 
దాంతో, మహేశ్‌కు అతను వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రమేష్‌ను మహేశ్ బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. ఫలితంగా మహేష్‌ను అంతం చేయాలని రమేశ్ నిర్ణయించుకున్నాడు. ఇందులోభాగంగా, గత ఏడాది డిసెంబరు 24న మైసిగండిలో పార్టీ చేసుకుందామంటూ కారులో మహేశ్‌ను తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత తిరుగు ప్రయాణంలో శంషాబాద్‌ ప్రాంతానికి చేరుకున్నారు. 
 
మార్గమద్యంలో స్నేహితులతో కలిసి మహేశ్‌ గొంతుకు తీగ బిగించి రమేశ్‌ హత్య చేశాడు. అనంతరం కారును శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముచ్చింతల్‌ గ్రామానికి తీసుకెళ్లి మృతదేహాన్ని అక్కడ పడేసి నిప్పంటించాడు. కారును శంషాబాద్‌ తీసుకొచ్చి సర్వీసింగ్‌కు ఇచ్చాడు. 
 
కారులో రక్తం ఉండడాన్ని గమనించిన వాషింగ్‌సెంటర్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో, రమేశ్‌ గౌడ్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రమేశ్‌ కోర్టు వాయిదాలకు వెళ్లి వస్తున్నాడు. 
 
ఈ క్రమంలో రమేశ్‌ గౌడ్‌ బుధవారం ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ కోర్టు వాయిదాకు వచ్చాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అక్కడ కాపు కాసిన లక్ష్మణ్‌, కిషన్‌ అతనిని వెంటాడి.. వేటాడి హత్య చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు