పిల్లలు వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు : జేసీ దివాకర్

బుధవారం, 10 మే 2017 (15:40 IST)
పిల్లలు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తో ఇలా రోడ్డు ప్రమాదాల్లో అర్థాంతరంగా చనిపోతున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు జీర్ణించుకోలేమన్నారు. పైగా, ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిపోతుందన్నారు. 
 
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మలు బుధవారం వేకువజామున హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిందని అన్నారు. ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని ఆయన ఆక్షేపించారు. 
 
రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువకులు తమ వంశాన్ని ఉద్దరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త జీర్ణించుకోవడం కష్టమన్నారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు.
 
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి... మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియగానే ఆసుపత్రికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదన్నారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబ సభ్యలను ఆయన ఓదార్చారు. ఎంతో భవిష్యత్ చూడాల్సిన పిల్లాడ్ని ఇలా చూడాల్సి రావడం బాధాకరమన్నారు. 

వెబ్దునియా పై చదవండి