గంగినేని పాలెం ఘ‌ట‌న‌పై ఎస్సీ క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తాం...

గురువారం, 20 జనవరి 2022 (15:05 IST)
కృష్ణా జిల్లా మైలవరం మండ‌లంలో దళిత యువకులపై దాడి చేసిన గంగినేనిపాలెం సర్పంచ్ పిల్లి రామారావు, ఎంపీటీసీ సభ్యుడు పిల్లి ప్రసాద్ లను తక్షణమే అరెస్ట్ చెయ్యాల‌ని ఎమ్మార్పీఎస్ ద‌ళిత సంఘాల నాయకుల డిమాండ్ చేశారు.
 
 
సంక్రాంతికి పేకాడుతున్నార‌ని కృష్ణా జిల్లా జి కొండూరు మండలం, గంగినేని పాలెం గ్రామంలో దళిత యువకులపై మారణా యుధాలతో, విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రజాప్రతినిధులు పిల్లి రామారావు, పిల్లి ప్రసాద్ లు జరిపిన దాడిలో గాయపడ్డ దళిత యువకులు సంగీత సురేష్, వరగాల చిరంజీవి, ఇనపనూరు చంటి లను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎపిఎంఆర్పీఎస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు మందా నాగ మల్లేశ్వరరావు, మైలవరం నియోజకవర్గం దళిత నాయకులు నల్లమోతు ప్రసన్న బోస్ లు పరామర్శించారు.
 
 
అనంతరం వారు మాట్లాడుతూ, పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా దళితులపై దాడి చెయ్యటం చాలా దారుణమన్నారు. కేసు నమోదు చేసి రెండు రోజులు అవుతున్నా ఇంతవరకు పోలీసులు దోషులను అరెస్ట్ చెయ్యకపోటం చాలా విచారకరమన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు, భాదితులకు న్యాయం జరిగే వరకు ఎపిఎంఆర్పీఎస్, దళిత సంఘాలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
 
అవసర‌మైతే ఎపిఎంఆర్పీఎస్, మాల మహానాడు, దళిత సంఘాలను కలుపుకొని చలో గంగినేని పాలెంకు పిలుపునిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎస్సి కమిషన్ లో పిర్యాదు చేసి గంగినేని పాలెం రప్పించి, భాదితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. ఆలస్యం చెయ్యకుండా, కృష్ణా జిల్లా డిఎస్పీ వెంటనే నిందుతులను అరెస్ట్ చేసి, భాదితులకు న్యాయం చేయాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు